సినీ మాయలో పడి మోసపోయిన యువతుల కధనాలకు కొదవలేదు. అయితే ఎన్ని కధలు పుట్టుకొస్తున్నా… వాటికీ మరిన్ని జోడయ్యే విధంగా సంఘటనలు జరుగుతుండడం… అనేది సినిమా ప్రపంచంపై ఉన్న మోజును చాటిచెప్తోంది. తాజాగా బోడుప్పల్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతి కూడా సినీ మాయలో పడి మోసగించబడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సినిమాల్లో నటించాలని ఉన్న ఓ యువతికి మధురానగర్ లో నివసిస్తున్న కార్తికేయతో ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఫేస్ బుక్ ప్రొఫైల్ లో సినీ దర్శకుడినని ఉండడంతో అతని పరిచయాన్ని అంగీకరించిన ఆమె, కాలక్రమంలో ఆలోచనలు నచ్చడంతో సినిమాకు పెట్టుబడి పెడతానంటూ ముందుకు వచ్చింది. దీంతో ఎవరినో ఎందుకు నీకే స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తానన్న వంకతో ఆమెతో కొన్ని ఫోటోషూట్ లు నిర్వహించి, ఆమెను లోబరుచుకున్నాడు.
అనంతరం ఆ ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో విసిగి వేసారిన ఆమె చివరికి హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు మోసగించిన వ్యక్తిపై రేప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణానగర్ లో ఇలాంటి కధలవ్యధలకు కొదవుండదన్న విషయం సినీ జనాలకు తెలిసిందే.


