ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల సమయంలో, ముఖ్యంగా పోలింగ్కు ముందు, తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లు చూసి ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు. అవమానంగా భావిస్తున్నారు. కానీ వైసీపి నేతలు ఎవరూ అలా భావించడం లేదు.
అయినా ఆంధ్రాకు రాజధాని లేకపోతేనే సిగ్గు, అవమానం అనిపించని వారికి ఈ అల్లర్లకు సిగ్గు పడతారనుకోవడం అత్యాశే అవుతుంది కదా?
ఈ అల్లర్లకు టిడిపి, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిలే కారణమని వైసీపి నేతలు ఆరోపిస్తూ తమ తప్పులను వారికి అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ తమ ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తున్న పోలీసులే తమ వైసీపి నేతలనే అరెస్ట్ చేస్తున్నారు కదా అంటే వారు కూడా టిడిపితో కుమ్మక్కు అయిపోయారని తేల్చిపడేశారే తప్ప తమ గురించి ప్రజలు ఏమనుకుంటారో అనే వెరుపే లేదు ఎవరికీ.
2014లో రాష్ట్ర విభజన సమయంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ప్రజలు తీవ్ర ఆవేశంగా ఉండేవారు. ఇరు ప్రాంతాలలో జోరుగా ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతుండేవి. ఆ సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కానీ అప్పుడు ఎక్కడా ఇటువంటి అల్లర్లు జరుగలేదు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో మరోసారి ఎన్నికలు జరిగాయి. అదే సమయంలో వివేకా హత్య కూడా జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే వెంటనే జగన్, అవినాష్ రెడ్డిలతో సహా అందరిపై కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించి జైల్లో వేయించగలిగేవారు. ఎన్నికలు తమకు అనుకూలంగా జరిపించుకోగలిగేవారు.
కానీ ఆయన ఆవిదంగా చేయకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అన్ని విదాలా సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిపించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండిపోవడం వలననే ఆ ఎన్నికలలో వైసీపి గెలవగలిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారనేది వాస్తవం.
కానీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి రెండు ఎన్నికలను ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు. ఆయన నేతృత్వంలో టిడిపి, ఇప్పుడు అల్లర్లకు తెగబడిందనే వైసీపి నేతల వాదనలు నమ్మశఖ్యంగా ఉన్నాయా?
అయినా ఎన్నికలకు ముందు నుంచే గెలుపు ధీమాతో ఉన్న టిడిపి కూటమి, ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడి చేజేతులా తమ విజయావకాశాలను దెబ్బ తీసుకుంటుందా? అంటే కాదనే అర్దమవుతోంది.
ఒకవేళ జగన్ చెప్పుకుంటున్నట్లు వైసీపికి 175/25 సీట్లు గెలుచుకుంటామనే ధీమా ఉన్నట్లయితే వైసీపి నేతలు ప్రవర్తన ఈవిదంగా ఉండేదా? అంటే కాదనే అర్దమవుతోంది.
వైసీపి నేతల మానసిక పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దం చేసుకోవాలంటే ఓసారి కేసీఆర్ని చూస్తే అర్దమవుతుంది. తెలంగాణలో పదేళ్ళు ఇష్టారాజ్యం చేసిన కేసీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక గత 4-5 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఏపీలో వైసీపి నేతలు కూడా ఓటమి భయంతోనే ఈవిదంగా వ్యవహరిస్తున్నారని అర్దమవుతుంది.
వైసీపి నేతలలో ఇంత భయాందోళనలు నెలకొని ఉన్నందునే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా అసహనంతో మళ్ళీ అల్లర్లకు తెగబడవచ్చని కేంద్ర ఎన్నికల కమీషన్ ముందే ఊహించి, జూన్ 4 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో అదనంగా మరో 5 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను మోహరింపజేయాలని నిర్ణయించింది.
తమ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని ఈసీ భావించడాన్ని కూడా వైసీపి నేతలు ఎవరికీ అవమానంగా అనిపించడం లేదు. దానినీ కుట్రగానే అభివర్ణిస్తున్నారు… ఎందుకంటే పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కదా?






