
ఈ మధ్యనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వంగవీటి రాధ మొత్తానికి తన రాజకీయ భవిషత్తు గురించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. వంగవీటి రాధ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఎంపీ సుజనాచౌదరి వీరిద్దరిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. దాదాపుగా రెండు గంటల పాటు వారి మధ్య అనేక విషయాలపై చర్చలు జరిగాయని సమాచారం.
వంగవీటి రాధ పార్టీలో చేరితే ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వంగవీటికి టికెట్ ఇస్తే మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణను పెడన శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది. కొనకళ్ల కూడా ఇందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. రాధ పోటీ చేస్తే ఆయనను మచిలీపట్నంకే పరిమితం చెయ్యకుండా కాపులు ఎక్కువగా ఉండే అన్ని నియోజకవర్గాలలోను తిప్పాలని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది.
వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు రాధా. అయితే దానిని మల్లాది విష్ణుకు కేటాయించారు జగన్. ఆ తరువాత నుండి పొమ్మనలేక పొగ బెట్టి చివరకు ఆయన బయటకు పంపించేశారని రంగా అభిమానుల అభిప్రాయం. విజయవాడలో తాము సీటు ఇవ్వలేమని, అవసరమైతే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ చెప్పింది. అయితే రాధ ఎన్నికలలో పోటీ చెయ్యడానికే సిద్ధం అయినట్టు తెలుస్తుంది. గతంలో మచిలీపట్నం ఎంపీగా అవకాశం ఇస్తా అని జగన్ చెప్పినా రాధ ఒప్పుకోకపోవడం గమనార్హం.



