ఏ రాజకీయ పార్టీలోనైనా నేతలు కుమ్ములాటలు సర్వసాదాహరణమే. అధికార వైసీపీ కూడా ఇందుకు మినహాయింపు కాదని చెపుతూ మైలవరం నియోజకవర్గంలో మళ్ళీ మంత్రి జోగి రమేష్, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గాల మద్య మరోసారి ఘర్షణ పడ్డారు. దీనికి కారణం మంత్రి జోగి రమేష్ అనుచరుడు ధీరజ్ పుట్టినరోజు సందదర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు నుంచి మైలవరం వెళ్ళే మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫోటో లేకపోవడమే.
ధీరజ్కు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్లను వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు చించివేశారని మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే తమ నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే ఫోటో లేకుండా మంత్రి ఫోటోతో బ్యానర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఏమి సంకేతాలు పంపుతున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
ఇదివరకు ఓసారి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేరుగా మంత్రి జోగి రమేష్ని ఉద్దేశ్యించి మీడియాతో మాట్లాడుతూ, “ఈరోజుల్లో రాజకీయాలు చేయడం అంటే ప్రజలకు సేవ చేయడం కాదు…. అనుచరుల పేరుతో పదిమంది గూండాలను వెంటేసుకొని వీధుల్లో తిరుగుతూ ప్రజలని భయపెడుతుండటమే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
ప్రతిపక్ష నేతలతో నిత్యం ఏదో సాకుతో గొడవ పెట్టుకొని దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది. నేను అటువంటి నీచ రాజకీయాలు చేయలేక వెనకబడిపోతున్నాను. కానీ మైలవరం ప్రజలకు నేను ఎటువంటివాడినో బాగా తెలుసు. కనుక అవతలి వ్యక్తులు ఎన్ని వేషాలు వేసినా వచ్చే ఎన్నికలలో మళ్ళీ నాకే మైలవరం నుంచి టికెట్ లభిస్తుంది. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప గడప గడపకి కార్యక్రమంలో తిరిగి ప్రయోజనం ఉండదు,” అంటూ ఆ కార్యక్రమమానికి దూరంగా ఉండిపోయారు.
మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మద్య కీచులాటలు సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో, ఒకరి నియోజకవర్గంలో మరొకరు హడావుడి చేయవద్దని ఇద్దరికీ సర్దిచెప్పారు. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ వారిరువురూ కీచులాడుకొంటున్నారని తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి చొరవ తీసుకొని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు. కానీ అవీ ఫలించలేదని ఫ్లెక్సీ బ్యానర్లు చించుకోవడంతో స్పష్టం అయ్యింది.
వైసీపీలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారిని పక్కన పెట్టేస్తానని జగన్ నిన్ననే హెచ్చరించారు. బహుశః వారిలో వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఒకరై ఉండవచ్చు. అందుకే ఆయన వర్గం ఈవిదంగా తమ అసహనాన్ని తెలియజేస్తోందేమో?



