వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా అది మీడియాలో హైలైట్ అయ్యింది. దానిపై చాలా రాజకీయ విశ్లేషణలు కూడా జరిగాయి. మొదట్లో చక్రం తిప్పిన ఆయనను జగనన్న పక్కన పెడుతుండటంతో ఆయన వైసీపీకి దూరంగా ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారని, బహుశః అందుకే తన అసంతృప్తిని తెలియజేసేందుకు పార్టీలో అందరికీ తెలిసేలాగా సోషల్ మీడియాలో తమ అధినేతకు బద్ధ శత్రువైన చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చని విశ్లేషణలు వినిపించాయి.
దాంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత జగన్ ఆయనకు అక్షింతలు వేశారో ఏమో కానీ హటాత్తుగా ఆయన స్వరం మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ ఏవిదంగా అభివృద్ధి చెందుతోందో, జగనన్న సంక్షేమ పధకాలతో ఏవిదంగా బడుగు బలహీనవర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారో తెలియజేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తున్నారు.
జగనన్న విద్యావసతి దీవెన పధకం కోసం రూ.912 కోట్లు విడుదల చేయబోతున్నారని, దాంతో ఒక్కో విద్యార్ధికి రూ.10-20000 చొప్పున రాష్ట్రంలో మొత్తం 9.5 లక్షల విద్యార్థులు లబ్ధి పొందబోతున్నారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అంతకు ముందు ఏపీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వాటికి లక్ష్యానికి మించి రుణాల పంపణీ చేసిందని ఏడాదిలో లక్ష్యం 50-100 కోట్లు కాగా 9 నెలల్లోనే 53,419 కోట్ల రుణాల పంపిణీతో MSMEలను ఆదుకుందని, కరోనా కష్టకాలంలో MSMEలను ప్రోత్సహించి ఉద్యోగాలను కాపాడిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదని అధినేతను పొగుడుతూ ట్వీట్ చేశారు. వైసీపీలో ఉండాలనుకొంటే ఇలాగే మెయింటెయిన్ చేయడం మంచిది లేకుంటే కోటంరెడ్డి,ఆనంరెడ్డి, మేకపాటి, శ్రీదేవిల పక్కన కూర్చోవలసి ఉంటుంది.



