భారీ బడ్జెట్తో పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు కలిసి నిర్మిస్తున్న సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీలలో విడుదల చేయలేక పదేపదే వాయిదాలు వేసుకుంటున్నారు.
కానీ చిన్న దర్శకులు, హీరోలు చేస్తున్న సినిమాలు మాత్రం షూటింగ్ మొదలు పెట్టక మునుపే రిలీజ్ డేట్ ప్రకటించి మరీ సకాలంలో విడుదల చేస్తున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణలుగా మల్లాది విశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా చేస్తున్న మిరాయ్ సినిమాలు కళ్ళెదుట కనబడుతున్నాయి.
విశ్వంభర మొదలుపెట్టి అప్పుడే రెండేళ్ళు కావస్తోంది. షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఇంతవరకు ట్రైలర్ కూడా విడుదల చేయలేకపోయారు!
ఇటీవల విడుదల చేసిన ‘మెగా బ్లాస్ట్ గ్లిమ్స్’లో వచ్చే ఏడాది వేసవిలో విశ్వంభర విడుదల చేస్తున్నామంటూ చిరంజీవి మీడియాకు లీక్ ఇచ్చారు. ఇందుకు అభిమానులు సంతోష పడాలో, బాధ పడాలో తెలీని పరిస్థితి!
విశ్వంభర తర్వాత మొదలుపెట్టిన ‘మిరాయ్’ సినిమా ట్రైలర్ ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు సరిగ్గా చెప్పిన సమయానికి విడుదల చేశారు. మిరాయ్ సెప్టెంబర్ 5న విడుదల చేయాలనుకున్నప్పటికీ ఇతర సినిమాలతో క్లాష్ అవకూడదని ఒక వారం ఆలస్యంగా సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. అంటే సినిమా కూడా చెప్పిన సమయానికే విడుదల చేస్తున్నారన్న మాట!
విశ్వంభర గ్రాఫిక్ వర్క్స్ ఆలస్యం అవుతుండటం వలన సినిమా రిలీజ్ ఆలస్యమవుతోందని చిరంజీవి స్వయంగా సంజాయిషీ ఇచ్చుకున్నారు. కానీ విశ్వంభర కంటే ‘మిరాయ్’చాలా ఆలస్యంగా మొదలుపెట్టినప్పటికీ ఈరోజు విడుదలైన ట్రైలర్లో గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
చిరంజీవితో తేజా సజ్జాని పోల్చుకోలేము. కానీ విశ్వంభరని మిరాయ్తో పోల్చి చూడవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా మిరాయ్ గ్రాఫిక్ వర్క్స్ పూర్తిచేయగలిగినప్పుడు, విశ్వంభర గ్రాఫిక్స్ ఎందుకు ఆలస్యమవుతోంది?అని సందేహం కలుగక మానదు.
విశ్వంభర గ్రాఫిక్స్ నభూతో నభవిష్యతిలా ఉంటాయని అనుకున్నప్పటికీ, సెప్టెంబర్ 12న మిరాయ్ విడుదలై సత్తా చాటుకున్న తర్వాత తప్పనిసరిగా ప్రేక్షకులు, సినీ విమర్శకులు దాంతో విశ్వంభరని పోల్చి చూస్తారు. ఏమాత్రం తక్కువగా ఉన్నా నష్టపోయేది విశ్వంభరే కదా?
ఇదివరకు ఆదిపురుష్, హుమాన్ సినిమాల విషయంలో కూడా ఇలాగే జరిగింది కదా? కనుక విశ్వంభరని కనీసం దసరా దీపావళికి విడుదల చేయగలిగితే బాగుంటుంది.





