ఆంధ్రప్రదేశ్లో వైసీపి ప్రభుత్వం తీరు చాలా విచిత్రంగా ఉంది. వైసీపి శ్రేణులు టిడిపి నేతలు, కార్యకర్తలపై , వారి కార్యాలయాలపై దాడులు చేస్తే, పోలీసులు వారిని అరెస్ట్ చేయకుండా వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి నేతలపై కేసులు పెట్టి జైళ్ళకు పంపుతుంటారు.
కోనసీమలో అల్లర్లకు, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదానికి ప్రతిపక్షాలనే వైసీపి ప్రభుత్వం నిందిస్తుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ అవాంచిత ఘటన జరిగినా దానిని ఏదో సాకుతో ప్రతిపక్షాల నెత్తిన రుద్దేసి, కేసులు నమోదు చేసేసి టిడిపి, జనసేనలు రెండూ సంఘ విద్రోహశక్తులన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుండటం వైసీపి ప్రభుత్వ విధానంగా మారిపోయిన్నట్లుంది.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదానికి ‘లోకల్ బాయ్ నాని’ యూట్యూబర్ జనసేనకు చెందినవాడని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగానే నిర్ధారించేయడం విచిత్రంగా ఉంది.
అయితే అతనితో తమ పార్టీకి ఎలాంటి సంబందమూ లేదని, ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం, కూల్చే సంస్కృతి వైసీపిదే గానీ జనసేనది కాదని ఆ పార్టీ ఘాటుగా బదులిచ్చింది. జనసేన నిర్మాణాత్మక పార్టీ అని, రాష్ట్రాభివృద్ధినే కోరుకొంటుందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకొని కటినంగా శిక్షించాలని జనసేన కోరింది.
పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “రెండు మూడు రోజులలోనే నేను విశాఖకు వచ్చి ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులందరికీ ఒక్కొక్కరికీ రూ.50,000 చొప్పున జనసేన తరపున స్వయంగా అందిస్తానని” ట్వీట్ చేశారు.
ఈ రెండు ట్వీట్స్ జనసేన, నిర్ధోషిత్వానికి, చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయని అర్దమవుతోంది. ఈ ఘటనతో జనసేనకు ముడిపెట్టడానికి వైసీపి చేసిన ప్రయత్నం చూస్తున్నప్పుడు, జనసేనపై ఇంత అక్కసు దేనికి?అనే సందేహం కలుగకమానదు.
పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం, జనసేన టిడిపితో పొత్తు పెట్టుకోవడం, దాంతో ఎన్నికలలో వైసీపి నష్టపోతుందనే భయం లేదా ఆందోళన కారణాలుగా కనిపిస్తున్నాయి.




