నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకొని ఆ పార్టీ నాయకుల వరకు ఒక్కొక్కొరినిగా వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపింది. ఇప్పుడు జనసేన వంతు వచ్చినట్టుంది. విశాఖ టైకూన్ కూడలి నుంచి విఐపి రోడ్డు వైపు వెళ్ళే మార్గాన్ని మూసివేయడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, మూసిన రోడ్డును వెంటనే తెరిచి ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ రెండు రోజుల నుండి జనసేన నేతలు ఆందోళనలు చేస్తున్నారు.
అయితే ఆందోళన చేపట్టిన జనసేన నాయకులను పోలీస్ అక్రంగా పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆ రోడ్డు పునః ప్రారభించేంత వరకు మా పార్టీ నిరసనలు కొనసాగుతాయని నాదెండ్ల పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంతో ఈ రోజు కూడా టైకూన్ రహదారి మార్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ నిరసన తెలపడానికి వచ్చిన జనసేన పార్టీ నేతలను, పార్టీ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
స్థానిక వైసీపీ ఎంపీ నిర్మిస్తున్న భవనాలకు ఈ రోడ్డు మార్గం వాస్తుదోషంగా ఉందని భావించి అధికార పార్టీ ఎంపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల సాయంతో ప్రజలకు అవసరమైన రోడ్డు మార్గాన్ని మూసివేయడం అన్యాయమని, దీని వలన సుమారు రెండు కిలోమీటర్ల మేర అదనపు ప్రయాణ భారం ప్రజల పై పడుతుందని అధికారులు వెంటనే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను తొలగించి సాధారణ పరిస్థితులు తీసుకురావాలని జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు.
పోలీసుల తీరు పై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ప్రజా సమస్యల మీద పోరాడుతున్న తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం అక్రమమని, వెంటనే వారందరిని విడుదల చేయాలనీ లేకుంటే స్వయంగా తానే విశాఖ వచ్చి నిరసన తెలియచేస్తానని వైసీపీ ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను హెచ్చరించారు. మొన్నటి వరకు టీడీపీ నేతల మీద కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇక మిగిలిన జనసేన నాయకులను కూడా జైలుకి పంపిస్తే తన పని పూర్తవుతుందని భావించి ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు జనసైనికులు.




