వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఇప్పటికి అమలులోకి రాలేదు. కానీ ప్రస్తుతం అమలులో ఉన్న ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రెండు నియోజకవర్గాలలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభిప్రాయానికి విరుద్ధంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది అనే ఆరోపణతో వైసీపీ పార్టీ నుండి బహిష్కరించారు అధిష్టానం. పార్టీ నుండి బయటకు వచ్చిన శ్రీదేవి కూడా పార్టీ నిర్ణయం పై, అధినాయకత్వం పై అంతే ఎదురుదాడి చేసి టీడీపీ పార్టీ కండువా వేసుకున్నారు. ఇలా రాజధానిలో తన చేతులతో తామే సెల్ఫ్ గోల్ వేసుకుని మొదటి వికెట్ ను ప్రత్యర్థులకు అందించారు వైసీపీ పార్టీ.
ఇక తాజాగా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి నివాస ప్రాంతమైన తాడేపల్లి కేంద్రంగా వైసీపీ పార్టీ సెల్ఫ్ వికెట్ రూపంలో రెండో వికెట్ ను కోల్పోయింది. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వ్యక్తిగత కారణాలు సాకుగా చెప్పి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి రెండు సార్లు తనను ఎమ్మెల్యే గా ఎన్నుకున్న స్థానిక ప్రజలకు, పార్టీ తరుపున తనకు టికెట్ ఇచ్చిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపి రాజీనామా పత్రాన్ని అందచేశారు ఆర్కే.
ఎన్నికలకు సమయం సమీపించడంతో ప్రజల మూడ్ ను అంచనావేస్తూ పార్టీల కండువాలు మార్చడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. అలాగే కండువాలు మార్చిన రాజకీయ నాయకుల కుంటి సాకులు విని నోరెళ్లబెట్టడం ప్రజలకు కొత్తకాదు.ఇప్పటికే పార్టీకి, పార్టీ అధిష్టానానికి RRR కొరకరాని కొయ్యగా మారారు. ఇప్పుడు రాజధాని ప్రాంతంలోనే వైసీపీ ఇద్దరు ఎమ్మెల్యే లు పార్టీని వీడడం రాబోయే రోజులలో ఏపీ ప్రజలు వైసీపీ ఫ్యాన్ కి గట్టి షాక్ ఇవ్వబోతున్నారు అనే దానికి ఇది సంకేతం కానుందా? అంటూ స్థానికంగా చర్చ జరుగుతుంది.
అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉండి కూడా స్థానిక సమస్యలు తీర్చలేకపోతున్నాం అనే అసంతృప్తితో టీడీపీలో చేరిన ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటం రెడీ శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరో పక్క పార్టీకి తలనొప్పిగా మారడంతో ఇప్పుడు మరో రెడ్డి రామకృష్ణ రెడ్డి పార్టీనుండి వై తొలగడంతో సొంత సామజిక వర్గం నేతలే జగన్ ను నమ్మడం లేదనే వార్తను ప్రతిపక్షాలు బలంగా ప్రజలలోకి తీసుకెళ్తే జగన్ కు ఎదురుగాలి వీయడం ఖాయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




