హూ కిల్డ్ బాబాయ్?అంటూ టిడిపి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారని అడుగుతూనే ఉంది. దానికి వైసీపీ చంద్రబాబు నాయుడు, సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కుట్ర పన్ని చేశారని గట్టిగా వాదిస్తోంది. అయితే ఆనాడు వివేకా హత్య జరిగినప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇంకా భద్రంగానే ఉన్నాయి. కనుక నాటికీ, నేటికీ వారి వాదనలలో ఎంత తేడా ఉందో టిడిపి నేతలు రెంటినీ కలిపిసి సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉన్నారు.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఓ పక్క చిన్నాన్నను చంపుతూ ఉండగానే చిన్నాన్న పెన్ను కాగితం తీసుకొని లెటర్ వ్రాశారా? ఇది నమ్మశక్యంగా ఉందా అసలు? ఆ లెటర్ మీద రక్తం మరకలు కూడా ఉన్నాయి. చచ్చిపోతున్న చిన్నాన్న లెటర్ ఎలా రాస్తాడు? చిన్నాన్నను చంపుతుంటే అతని ముందే కూర్చొని లెటర్ రాస్తారా? నాకు డిఐజీ, ఎస్పీ ఆ లెటర్ చూపిస్తున్నారు. ఇది నమ్మశక్యంగా ఉందా?” అని ఆవేశంగా ప్రశ్నించారు.
ఈ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం మీడియాకు విడుదల చేసిన తాజా వీడియో సందేశంలో, “ఆరోజు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఏం జరిగిందనేది ప్రజలకు కూడా తెలియాలి. ఆ రోజు ఉదయం 6.30 గంటలకి శివప్రకాశ్ రెడ్డి నాకు ఫోన్ చేసినప్పుడు నేను పులివెందుల నుంచి కారులో జమ్మలమడుగు వెళుతున్నాను. బావ చనిపోయాడు వెంటనే అక్కడకు వెళ్ళమని చెప్పగానే నేను అక్కడ చేరుకొన్నాను. అక్కడ ఉన్న కృష్ణారెడ్డి (వివేకా పీఏ) బాత్ రూములో సార్ శవం ఉందని చెపితే లోనికి వెళ్ళి చూసాను. బయటకు వచ్చే ముందు ఏమైనా అనుమానాస్పదంగా ఉందా?అని నేను కృష్ణారెడ్డిని అడిగితే లేదన్నారు. అయితే మేము అక్కడికి చేరుకోక ముందే అక్కడ వివేకా ఉపయోగించే మొబైల్ ఫోన్, ఓ లేఖ ఉందని కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన వాటిని తీసి దాచిపెట్టేయమని చెప్పారు.
వివేకా చనిపోయే ముందు వ్రాసిన దానిలో ఏముందంటే, నేను డ్రైవర్ ప్రసాద్ను త్వరగా డ్యూటీకి రావాలని చెప్పినందుకు నన్ను చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టొద్దు… ఇట్లు వివేకానంద రెడ్డి” అని వ్రాసి ఉంది. ఆయన హత్య కేసులో ఈ లేఖే చాలా కీలకం. కానీ దానిని రాజశేఖర్ రెడ్డి దాచి పెట్టమన్నాడు. ఎందుకని అడిగితే డ్రైవర్ ప్రసాద్ చాలా మంచివాడు. అతని గురించి ఎవరైనా ఏమనుకొంటారో అని దాచి పెట్టమని చెప్పానన్నారు. అంటే వివేకాను కంటే డ్రైవర్నే ఎక్కువ నమ్ముతారా?” అని ప్రశ్నించారు.
టిడిపి మహిళా నేత అనితా వంగలపూడి ఈ రెండు వీడియోలను జోడించి సోషల్ మీడియాలో నేడు పోస్ట్ చేశారు.
“నాడు జగన్ : చనిపోయే వ్యక్తి లెటర్ రాస్తాడా అసలు? వాళ్ళు చంపుతా ఉంటే లెటర్ రాస్తాడా? నేడు అవినాష్ : లెటర్ రాసాడు లెటర్ చదవాలి, లెటరే ఎవిడెన్స్ ఏమి డ్రామాలు!!! సాధారణంగా సినిమాల్లో నటిస్తారు.. కాని మీరు మాత్రం నిజ జీవితంలో నటిస్తున్నారు,” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
కనుక అవినాష్ రెడ్డి సీబీఐ లేదా సునీత దంపతులను ప్రశ్నించడం కాదు. అది ఫేక్ లెటర్ అని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలకు సంజాయిషీ ఇస్తే బాగుంటుంది.



