ప్రతిపక్షంలో ఉన్నపుడు కాల్చేయండి, కొట్టేయండి అంటూ సినీ ఫక్కీలో ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే ప్రతి సమావేశంలోనూ తెలుగు ఉచ్చరించడానికి తడబడుతున్న వైనం తెలుగుదేశం పార్టీకి వరంగా మారుతోంది.
సీఎం ఎప్పుడు పేపర్ చూస్తూ ప్రసంగిస్తారా? అంటూ టీడీపీ వర్గాలు వేచిచూసే విధంగా పరిస్థితులు మారిపోయాయంటే, జగన్ మోహన్ రెడ్డి తెలుగు పలుకులు ఏ విధంగా ఉన్నాయో అవగతం చేసుకోవచ్చు. గతంలో లోకేష్ విషయంలో వైసీపీ కూడా ఇదే తీరును అవలంభించగా, అంతకుమించిన స్థాయిలో సీఎం ప్రసంగాలు నిలుస్తుండటంతో, ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల వంతవుతోంది.
ఇది ఇటీవల జరిగిన ఏ ఒక్క తెలుగు ప్రసంగానికో సంబంధించిన అంశం కాదు. అధికారం చేపట్టిన నాటి నుండి జగన్ తెలుగు ఉచ్ఛారణ ఇదే విధంగా ఉంటోంది. దీంతో అసలు సీఎంకు స్పీచ్ లు ఎవరు రాసేస్తున్నారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జగన్ పేపర్ చూస్తూ చదువుతున్నారు గనుక, ఎవరో ఒకరు ఖచ్చితంగా వాటిని ప్రిపేర్ చేస్తున్నట్లే భావించాలి.
ఆ ప్రిపరేషన్ లోనే తప్పులు దొర్లుతున్నాయా? లేక వాటిని పలకలేక సీఎం ఇబ్బందులు పడుతున్నారో గానీ, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదొక ప్రసంగంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైరల్ అవుతున్నారు. ఇంగ్లీష్ లో రాసిచ్చిన వాటిని తెలుగు పలికితే ఇలాంటి తప్పులు ఎక్కువగా దొర్లుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే సామాన్య ప్రజానీకానికి అర్ధం కాని విషయం ఏమిటంటే… ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి తప్పులకు తావు లేకుండా, పేపర్ చదవకుండా ఎలా మాట్లాడారు అని? బహుశా ముందస్తుగా ప్రిపేర్ అయ్యి వచ్చేవారేమో? అన్న సమాధానం ఒక్కటే లభిస్తోంది. మరి అధికారం చేపట్టాక కూడా అలాగే ప్రిపేర్ కావొచ్చుగా అంటే… ఇప్పుడు అంత అవసరం లేదేమో అనిపించక మానదుగా!!



