తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు మరో మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు సంచలన ఆరోపణలు చేశారు.
2023, డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపిలు కలిసి కుట్ర చేశాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన కేసీఆర్ చాలా మంచి పేరులభిస్తోంది కనుక దానిని కూల్చేయాలని కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
ఆ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్ ఒకరు ఎన్నికలకు రెండు నెలల ముందు అంటే 2023 అక్టోబర్, 21న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీ శభ్దాలు వినిపించాయని మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారని, కానీ ఇంతవరకు ఆ కేసు విచారణ జరుపలేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
హరీష్ రావు మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టుని దెబ్బ తీయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆ ప్రాజెక్టులో 60,000 క్యూసెక్కులు నీళ్ళు పారుతుంటే మోటార్లు ఆన్చేసి జలాశయాలు నింపకుండా వృధాగా సముద్రంలోకి విడిచిపెట్టేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ మోటార్లు-పంప్ సెట్స్ ఉన్నాయి. వాటిని ఆన్ చేసి ఉంచితే వచ్చిన నీటిని వచ్చినట్లు తోడి పోస్తుంటాయి. కానీ ఆ మోటార్లను పదేపదే ఆన్-ఆఫ్ చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే అంత భారీ మోటార్లు కాలిపోతాయి. అప్పుడు ప్రాజెక్ట్ మొత్తం పనికిరాకుండా పోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా పార్టీపై, కేసీఆర్పై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే ఈవిదంగా కుట్రలు చేస్తున్నారు,” అని హరీష్ రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పకపోవడం, వారి ఆరోపణలను ఖండించకపోవడం, అసత్య ఆరోపణలు చేసినందుకు న్యాయపరమైన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ మౌనం వారి ఆరోపణలను అంగీకరించినట్లే కదా?
ఈవిదంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం రాజకీయంగా ప్రత్యర్ధులను దెబ్బ తీసుకునే ప్రయత్నాలు చేస్తూ, మద్యలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటం పరిపాటిగా మారిపోయింది.




