కాసేపటి క్రితం జాతినుద్దేశించిన ప్రసంగిస్తూ ప్రధాని మోదీ.. వచ్చే నెల 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలపై రేపు పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. లాక్డౌన్ మార్గదర్శకాలను రూపొందిస్తున్న సందర్భంగా పేద ప్రజలు, దినసరి కూలీల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో ఈ నెల 20 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్టు మోదీ వెల్లడించారు. అప్పటివరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు పరచి, దేశంలోని పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలించనున్నట్టు మోడీ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ పొడిగింపులో ఇంకో విశేషం ఏమిటంటే… రాష్ట్రాలు అడిగినట్టు ఏప్రిల్ 30వరకు కాకుండా మే 3వరకు పొడిగించడం.
“మే 1న ప్రభుత్వ సెలవుదినం, మే రెండవ తేదీ శనివారం మరియు మే మూడవ తేదీ ఆదివారం. లాక్డౌన్ సడలింపు వచ్చిన వెంటనే ప్రజలు రోడ్లపైకి రావాలని మేము కోరుకోవడం లేదు. అందుకే మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగించడం జరిగింది” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇది ఇలా ఉండగా… భారత్ లో కరోనా కేసులు 10,000 మార్కుని దాటేశాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 10,363 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇందులో పదో వంతు అంటే వెయ్యికి పైగా కేసులు డిశ్చార్జ్ కావడం ఉపశమనం కలిగించే విషయం.



