ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హీరోలుగా చక్రం తిప్పిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, చంద్ర మోహన్ వంటివారు రకరకాల పాత్రలు చేసి మెప్పించేవారు.
వారిలో కొంతమంది విలన్ పాత్రలు కూడా చేసి మెప్పించారు. ఆనాడు వారు చేసినన్ని విభిన్నమైన పాత్రలు స్వీయ ఇమేజ్, పాన్ ఇండియా హోదా చట్రంలో చిక్కుకున్న నేటి అగ్రనటులు అటువంటి పత్రాలు చేయడం అసంభవమే.
అల్లు అర్జున్ పుష్పలో చందనం స్మగ్లర్గా నటించినప్పటికీ దర్శకుడు ఆయనని హీరోగానే చూపారు. ప్రేక్షకులు కూడా అలాగే చూశారు తప్ప విలన్గా చూడలేదు.
కానీ పెద్ద హీరోలు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయ(లే)కపోవడం పలువురు నటులకు వరంగా మారిందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో పాత్రలు చేసిన జగపతిబాబు ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకొని విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ టాలీవుడ్లో అద్భుతంగా రాణిస్తున్నారు.
అలాగే ఒకప్పుడు కామెడీ పాత్రలు చేసి మెప్పించిన సునీల్ కూడా మార్చుకొని విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ జాబితాలో నటుడు శివాజీ కూడా చేరారు. ఒకప్పుడు అయన కూడా ఫ్యామిలీ హీరోగా నటించినవారే. కానీ ఇప్పుడు విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు.
చిరంజీవికి మెగాస్టార్ బిరుదు అవరోధంగా మారడం వలన అయన తన స్థాయికి తగ్గ సినిమాలకే పరిమితం కావాల్సివస్తోంది. ఒకప్పుడు ఆయనతో పోటీ పడిన మోహన్ బాబుకి అలాంటి అవరోధాలు ఏవీ లేవు కనుక అయన కూడా పౌరాణిక, విలన్ పాత్రలు చేసి మెప్పిస్తున్నారు.
అయితే కొంతమంది హీరోలు నేటికీ ఈవిధంగా విభిన్నమైన పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ చేసేందుకు భయపడుతూ, రొటీన్ కథలు, పాత్రలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. కనుక సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గాయని బాధపడటం కంటే ఈవిధంగా అవకాశాలను అందిపుచ్చుకుంటే ఇంకా చాలా మంది రాణించవచ్చు. లేకుంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారు ఆ ఖాళీలను భర్తీ చేస్తారు.




