టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా చేతులు కలిపి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో కలిసి పోటీ చేసేందుకు సిద్దమైంది. కానీ టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకుంటే బీజేపీని క్షమించేయాలా?అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు.
దాదాపు 5 ఏళ్ళుగా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక, సామాజిక, రాజకీయ విధ్వంసానికి పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం చూసి చూడన్నట్లు ఊరుకొని, అవసరానికి మించి అప్పులు ఇప్పిస్తూ ఆయనకు తోడ్పడింది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ డ్రామాలు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నా మోడీ, అమిత్ షాలు వారించలేదు కనీసం పట్టించుకోలేదు.
జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పుడు మోడీ, అమిత్ షాలు మౌనంగా ఉండిపోయి జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పరోక్షంగా సమర్ధించారు.
జగన్ ప్రభుత్వం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం సరిపోదన్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ దానిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులను రోడ్డున పడేయబోతోంది. ఆనాడు రాష్ట్ర విభజన చేయవద్దని ఏపీ ప్రజలు కోరినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మవద్దని ఏపీ ప్రజలు కోరుతుంటే మోడీ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తెగేసి చెప్పారు. విశాఖ రైల్వే జోన్ సంగతి ఏమైందో తెలీదు. అయినా ఏపీ ప్రజలని ఓట్లు అడిగేందుకు బీజేపీ నిర్భయంగా వస్తోందంటే ఇది ప్రజల బలహీనతా… పార్టీల బలహీనత వలనా? అని ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవలసి ఉంది.
వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు ఎందుకు తగ్గిందో, దోషులపై చర్యలు తీసుకోకుండా ఎవరు బ్రేకులు వేస్తున్నారో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి.
చివరికి టిడిపి, జనసేనలతో పొత్తుల విషయంలో కూడా ఇన్ని రోజులుగా బీజేపీ పెద్దలు ఏవిదంగా వ్యవహరించారో అందరూ చూశారు. ఈవిదంగా వ్యవహరించి నందుకు రాష్ట్ర ప్రజలకు బీజేపీ సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉండగా, టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకుంటే అవన్నీ మాఫీ అయిపోతాయని భావిస్తున్నట్లుంది.
గతం గతః అని అనుకున్నా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో నిజాయితీగా ఉంటుందా?వైసీపీకి దూరంగా ఉంటుందా?అంటే అనుమానమే. కనుక బీజేపీ ముందుగా తన నిజాయితీ నిరూపించుకోవలసి ఉంటుంది. అందుకు అది ఏమేమి చేయాలో దానికీ తెలుసు… ఏపీ ప్రజలకు తెలుసు. కానీ ఏమీ చేయకుండా టిడిపి, జనసేనల పక్కన నిలబడితే బీజేపీకి ఓట్లు రాలవని గ్రహిస్తే వారికే మంచిది.






