అయితే శాసనసభకు రానని జగన్‌ చెప్పేసిన్నట్లేగా?

jagan-odarpu

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేసేందుకు, స్పీకర్‌, డెప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకునేందుకు శుక్ర, శనివారం రెండు రోజులు శాసనసభ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈసారి ఎన్నికలలో వైసీపి ఓడిపోయినప్పటికీ జగన్‌తో కలిపి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. వారు కూడా రేపు శాసనసభకు వచ్చి ప్రమాణస్వీకారాలు చేయాల్సి ఉంది.

ADVERTISEMENT

ఈ నేపధ్యంలో నేడు తాడేపల్లి ప్యాలస్‌లో జగన్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, “శాసనసభలో మనకు సంఖ్యా బలం తక్కువ. కనుక అక్కడ మనం చేసేది తక్కువే. కానీ రాష్ట్రంలో 40 శాతం ప్రజలు మనతోనే ఉన్నారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. కనుక ఎన్నికలలో ఓడిపోయామనే భావన మనసులో నుంచి తీసేయండి. మనం ఓడిపోలేదు.

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ మనం మేలు చేశాము. కనుక మనం గర్వంగా తలెత్తుకొని ప్రజల మద్యకు వెళ్దాం. మన పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడి వారిని కాపాడుకుందాం. రాబోయే రోజుల్లో నేనే స్వయంగా ప్రతీ కార్యకర్తని కలిసి వారికి భరోసా కల్పిస్తాను.

ఈ రాష్ట్రంలో మనల్నే నమ్ముకొని కోట్లమంది ప్రజలున్నారు. మనం పక్కకు తప్పుకుంటే వాళ్ళు అన్యాయం అయిపోతారు. కనుక వారికి కూడా మననే భరోసా ఇవ్వాలి. నాకు పోరాడేందుకు వయసు, శక్తి రెండూ ఉన్నాయి. 2029వరకు చంద్రబాబు నాయుడుని గద్దె దించలేము కనుక అంతవరకు మనం పోరాడుతూనే ఉందాము. ఈలోగా శిశుపాలుడి పాపాలు పండిన్నట్లు చంద్రబాబు నాయుడు పాపాలు కూడా పండుతాయి. అప్పుడు 2029 ఎన్నికలలో మనమే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాము,” అని జగన్‌ చెప్పారు.

ఈసారి ఎన్నికలలో కూడా అందరూ జగన్‌ని చూస్తే ఓట్లు వేశారు తప్ప వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధులను చూసి కాదు. సిద్ధం పోస్టర్లే ఇందుకు సాక్ష్యం.

కనుక వైసీపికి వచ్చిన 39.37% ఓట్ షేర్, 11 సీట్లు కూడా జగన్‌ వల్లనే పడ్డాయి. ఈ లెక్కన జగన్‌ ధోరణి నచ్చకనే ప్రజలు వైసీపిని తిరస్కరించారని స్పష్టమవుతోంది.

కానీ నేటికీ జగన్‌ తన వలననే వైసీపి ఓడిపోయిందని ఒప్పుకోకుండా ‘ఈవీఎంలు… శకుని పాచికలు’ అంటూ పురాణాలు చెపుతూ పార్టీ నేతలను మభ్యపెడుతున్నారు.

శాసనసభ సమావేశాలకు హాజరైతే ఏమవుతుందో తెలుసు కనుక మళ్ళీ ఓదార్పుయాత్ర లేదా మరో పేరుతో ప్రజల మద్య తిరుగుతూ కాలక్షేపం చేయాలనుకుంటున్నట్లు అర్దమవుతోంది. అయితే ఇప్పుడు ఓదార్పు, భరోసా కావలసింది జగన్‌కే గానీ ప్రజలకు కాదు.

ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టిడిపి కూటమి అధికారంలోకి రావాలనే కోరుకొని గెలిపించారు కనుక. ఆయన తమ ఆకాంక్షలు, సమస్యలు తెలుసని ప్రజలు నమ్ముతున్నారు కనుక వారికి జగన్‌ భరోసా, సోళ్ళు కబుర్లు, మళ్ళీ ముద్దులు, ఆశీర్వదాలు అవసరమే లేదు.

చివరిగా ఓ సందేహం… జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను మేలు చేస్తున్న ప్రజలను చూసే భయపడుతూ వారి వలన తనకు ప్రమాదం ఉంటుందని పరదాలు కట్టించుకొని, చెట్లు నరికించేస్తూ, ప్రజలకు అందనంత ఎత్తులో హెలికాఫ్టర్‌లలో తిరిగేవారు కదా… మరిప్పుడెలా? ఇప్పుడు ప్రజల వలన ప్రమాదం ఉండదా?

ADVERTISEMENT
Latest Stories