ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో గురువారం తాడేపల్లి ప్యాలస్లో సమావేశమయ్యారు.
వైసీపి సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి ఆటుపోట్లు చాలా చూశామని, ప్రతిపక్ష పార్టీగా పోరాడం మనకు కొత్త ఏమీ కాదు కనుక మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడదామని అన్నారు. టిడిపి కూటమి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మన ఓటింగ్ శాతం 40 కంటే తగ్గించలేకపోయారని అన్నారు. ఇది మన 5 ఏళ్ళ సుపరిపాలనకు గీటురాయి అని అన్నారు.
ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్, కేటీఆర్లు చెపుతున్న మాటలు ఒకేలా ఉన్నాయి. ఓడిపోయిన వారందరూ కాస్త అటూఇటూగా ఇవే మాటలు చెపుతుంటారు.
ఇక ఏపీలో ఈ 5 ఏళ్ళ వైసీపి పాలనలో అన్నీ అక్రమాలు, అవినీతి, అరాచకాలే జరిగాయి తప్ప మరొకటి జరగలేదు. దానినే జగన్ 5 ఏళ్ళ సుపరిపాలన అంటున్నారు. దానినే ప్రజలు రిఫరెండంగా భావించి తమను ఓడించారని గుడివాడ అమర్నాధ్ చెపుతున్నారు.
ఈ 5 ఏళ్ళుగా టిడిపి, జనసేనలని నిర్వీర్యం చేయడానికి, వాటిని కలవకుండా అడ్డుకోవడానికి జగన్ రాష్ట్రాన్ని, అభివృద్ధిని గాలికి వదిలి మరో పని లేన్నట్లు కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవేవీ ఫలించలేదని ఓటమి స్పష్టం చేస్తోంది. ఈ 5 ఏళ్ళలో ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కుట్రలు చేయడం వలననే ఓడిపోయామని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు.
నిజానికి వైసీపిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓడించలేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓడించుకున్నారు. వారిద్దరి చేత, ప్రజల చేత ఓడింపజేసుకున్నారు. కనుక తన వైఫల్యాలను ఎవరిపైనో రుద్ది తప్పించుకోవాలనుకునే బదులు ఓటమికి పూర్తి బాధ్యత వహించి పార్టీని ఎవరైనా యోగ్యుడి చేతిలో పెట్టి హుందాగా పక్కకు తప్పుకోవడం చాలా మంచిది. జగన్ దెబ్బ ఎలా ఉంటుందో ప్రజలు రుచి చూశారు. అది భరించలేకనే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారం అప్పజెప్పారు. కనుక జగన్కు మళ్ళీ ఎన్నటికీ అవకాశం లభించదు.
అయినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడానికి జగన్కు అంత టైమ్ లేదనే చెప్పవచ్చు. పైగా ఇంతగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళతారు? వెళ్ళినప్పుడు ప్రజలు నిలదీస్తే వారికి సమాధానాలు చెప్పగలరా?






