గతంలో కేసీఆర్-జగన్ ప్రభుత్వాలు కత్తులు దూసుకొంటున్నట్లు నటించిన్నప్పటికీ, పరస్పరం రాజకీయంగా సహకరించుకొంటూ ఉండేవి. అందుకోసం కేసీఆర్ ప్రభుత్వం ఏమీ పణంగా పెట్టలేదు. ఏమీ నష్టపోలేదు కూడా. కానీ వైసీపి ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టిందని అందరికీ తెలుసు. ఇప్పుడిది గత చరిత్ర.
అందుకే ఇప్పటి వరకు ఓ లెక్క… ఇప్పుడు రేవంత్ రెడ్డితో మరో లెక్క… అని తెలంగాణలో ప్రజలే కాదు ఏపీలో వైసీపి నేతలు కూడా అనుకొంటున్న మాట!
రేవంత్ రెడ్డి ఒకప్పటి చంద్రబాబు నాయుడు శిష్యుడని అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు ఆయన జగన్ ప్రభుత్వంతో ఏవిదంగా వ్యవహరిస్తారు? జగన్ ప్రభుత్వం ఆయనతో ఏవిదంగా వ్యవహరిస్తుందనేది చాలా ఆసక్తికరం.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కుదురుకోవడానికి కనీసం ఆరు నెలలు పట్టవచ్చు. సమర్ధుడైన మంచి నాయకుడుగా పేరు తెచ్చుకొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకొనేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకోసం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీల అమలు చేసేందుకు ప్రయత్నించవచ్చు.
కేవలం 5 సీట్ల మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినందున, బిఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు.
ఆలోగా ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కనుక తెలంగాణ ప్రభుత్వ పరంగా ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
అయితే ఏపీ ఎన్నికల సమయానికి రేవంత్ రెడ్డి పదవిలో కొంత కుదురుకొంటారు కనుక ఆనాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడుని గద్దె దించేందుకు జగన్మోహన్ రెడ్డికి తోడ్పడ్డారో అదేవిదంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు టిడిపి, జనసేనలకు తోడ్పడవచ్చు.
కేసీఆర్ మళ్ళీ జగన్కు తోడ్పడకుండా రేవంత్ రెడ్డి అడ్డుకొనే ప్రయత్నం కూడా చేయవచ్చు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ తర్వాత ఏపీ రాజకీయాలు, ఎన్నికలపైన దృష్టి పెట్టడం ఖాయమే. కనుక కాంగ్రెస్ అధిష్టానం జగనన్న బాణాన్ని ఆయన మీదకే ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. ఏపీ రాజకీయాలలో బీజేపీ వైఖరి ఏమిటో తెలిస్తే ఏపీలో కూడా పవర్ ప్లే మొదలైన్నట్లే.




