ఐదేళ్ళ క్రితం వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఆ తర్వాత కధ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. గత ఏడాది జూలై నెలాఖరులోగా ఈ కేసు విచారణను పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గడువు విధించినా నేటికీ అది సాగుతూనే ఉంది.
ఈ కేసులో సీబీఐ, సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని నిసహాయస్థితిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఒక అధ్యాయం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా షర్మిల పోటీ చేస్తుండటంతో ఈ కేసులో మరో అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు.
ఐదేళ్ళుగా విచారణ జరుపుతున్నా సీబీఐ పరిష్కరించలేకపోయిన ఈ కేసుని వైసీపి నేతలే నోరుజారి మాట్లాడి పరిష్కరించబోతున్నట్లున్నారు. వైఎస్ షర్మిల, సునీతారెడ్డి ఇద్దరూ కూడా వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డినే వేలెత్తిచూపుతూ తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో, ఆయనకు, వైసీపి నేతలకు స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే అవినాష్ రెడ్డి, సజ్జల రెడ్డి ఇద్దరూ చాలా ఆచితూచి బ్యాలన్సుగా మాట్లాడితే, కమలాపురం వైసీపి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి నోరుజారి సీబీఐ ఆరోపణలను ధృవీకరిస్తున్నట్లు మాట్లాడేశారు. అదీ… అవినాష్ రెడ్డి… మీడియా, వేలాదిమంది ప్రజల సమక్షంలో!
మొన్న కడప జిల్లా, మొయిళ్ళకాల్వ వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు, “ఆరోజు వివేకా హత్య జరిగిన తర్వాత ఫోన్ వస్తే అవినాష్ రెడ్డి అక్కడకు వెళ్ళారు. అప్పటికే అక్కడ గంగిరెడ్డి ఏదో చేస్తున్నాడు. గంగిరెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరూ ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకునేంత మంచి స్నేహితులు. గంగిరెడ్డి ఆయనకు అంత సన్నిహితుడు కనుక ఆయన ఏదో చేస్తున్నారని అవినాష్ రెడ్డి అమయాకంగా ‘ఆయన చేస్తున్నది’ (సాక్ష్యాధారాలను తుడిచేస్తుండటం) చూస్తూ ఉండిపోయారు.
ఆ తర్వాత వివేకా మరణం గురించి అవినాష్ రెడ్డి మీడియాకు తెలియజేస్తూ మాట్లాడారు… అంతే తప్ప ఆయనకు మరేమీ తెలియదు,” అని రవీంద్రనాధ్ రెడ్డి చెప్పారు. ఆయన బహిరంగ వేదిక మీద ఈ మాటలు చెపుతుంటే పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.
ఆ తర్వాత అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, “వాళ్ళు (షర్మిల, సునీతా రెడ్డి) నాపై పదేపదే బురద, బూడిద జల్లుతుంటారు. వాటిని నేను తుడుచుకుంటూ పోతే వాళ్ళు ఇంకా జల్లుతూనే ఉంటారు. కనుక వారి మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కడప ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. కనుక నేను వారి ఆరోపణలకు బదులు ఇవ్వదలచుకోలేదు,” అని అన్నారు.
వివేకా హత్య కేసులో వైసీపి నేతలు మొదట ఏమి చెప్పారో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు సీబీఐ చార్జ్ షీటులో పేర్కొన్నట్లే గంగిరెడ్డి సాక్ష్యాధారాలు నాశనం చేశాడని రవీంద్రనాధ్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఆయన ఆ పని చేస్తుంటే అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారంటూ మరో బాంబు పేల్చారు.
అంటే వివేకా హత్య కేసులో ఇంతకాలం సీబీఐ ఏం చెపుతోందో రవీంద్రనాధ్ రెడ్డి అదే చెప్పారని అర్దమవుతోంది. కనుక ఆయన మీడియా సమక్షంలో చెప్పిన ఈ మాటలు ఈ కేసు ముగించడానికి సీబీఐకి ఎంతగానో తోడ్పడవచ్చు.
సీబీఐ 5 ఏళ్ళుగా చేయలేకపోయిన ఈ పనిని రవీంద్రనాధ్ రెడ్డి కేవలం 5 నిమిషాల ప్రసంగంలో పరిష్కరించేశారు. ఇందుకు సీబీఐ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే. ఇప్పుడు సీబీఐ వంతు. ఏవిదంగా స్పందిస్తుందో?
మొన్నటిదాకా cbn గారి మీద ఏడ్చారు కదరా ?
ఇప్పుడు గంగిరెడ్డి చేస్తే , అవినాష్ జస్ట్ calm గా చూస్తూ ఉన్నాడు అంట ..!
ఇంత లుచ్చగాళ్ళకి ఎలా వేస్తారు రా ఓట్లు మీరు ..!— POKURI_SRINIVAS (@TDP_EVER) April 6, 2024






