మాజీ మంత్రి జోగి రమేశ్ని పోలీసులు ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని అయన నివాసంలో అరెస్ట్ చేశారు. కనుక ముందే చెప్పుకున్నట్లు దీనిలో రెండో అధ్యాయం మొదలైంది.
నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశామని పోలీసులు ఒకే ఒక్క కారణం చెప్పారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముచ్చటగా మూడు కారణాలు చెప్పారు.
1. అధికార పార్టీ నేతలే నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఆ నింద మాపై వేసి తప్పించుకునే ప్రయత్నంలోనే జోగి రమేశ్ని అరెస్ట్ చేశారు.
2. మొంథా తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్ళించేందుకు అరెస్ట్ చేశారు.
3. కాశీబుగ్గ ఆలయంలో త్రొక్కిసలాట నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు అరెస్ట్ చేశారు.
బీసీ వర్గానికి చెందిన జోగి రమేశ్ని ఈ కేసు పేరుతో అరెస్ట్ చేయడం అన్యాయం కనుక దీనిని జగన్ ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ నేతలు కూడా ఆయనకు కోరస్ పాడుతున్నారు.
గతంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేసింది. అప్పుడు టీడీపి కూడా ఇలాగే వాదించింది. కానీ చంద్రబాబు నాయుడు నిజంగానే అవినీతికి పాల్పడ్డారు కనుకనే అరెస్ట్ చేశామని జగన్ ప్రభుత్వం సమర్ధించుకుంది.
కానీ ఇప్పుడు ఏ కేసులో వైసీపీ నేతలను ఎవరిని అరెస్ట్ చేసినా అన్యాయం, అక్రమం, రాజకీయ కక్షతోనే తమని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంటే వైసీపీ చేస్తే సంసారం టీడీపి చేస్తే వ్యభిచారమా?
అయినా ఎలాంటి కేసుతోనైనా ఫుట్ బాల్ ఆడేసుకోగల వైసీపీ, జోగి రమేశ్, మిథున్ రెడ్డి లేదా మరొకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన్న ఆందోళన చెందుతుందా? అంటే కాదనే చెప్పుకోవాలి.
ఈ అరెస్టులు, ఖండనలు, కేసులు, బెయిల్ వీటి గురించి వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టడం, ఇవన్నీ రాజకీయ ప్రక్రియలో భాగం మాత్రమే. ఇవన్నీ సొంత మీడియా, సోషల్ మీడియాలో కధలు కధలుగా వర్ణిస్తూ ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెంచడం, అదే సమయంలో వైసీపీ వైపు ఆకర్షించడానికే అని భావించవచ్చు. ఈ అధ్యాయం తర్వాత బెయిల్ వార్తల అధ్యాయం మొదలవుతుంది.







