కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ఐదేళ్లుగా నోటికి హద్దు అదుపు లేకుండా వాగిన ప్రతి ఒక్కరి మీద చట్టబద్దంగా చర్యలుంటాయని, అన్ని రెడ్ బుక్ లో నమోదుచేశామని, ఈ ఐదేళ్లుగా వైసీపీ విధ్వంసం ఫలితంగా కారిన ప్రతి కన్నీటి బొట్టుకు న్యాయం జరుగుతుంది అంటూ హామీ ఇచ్చారు నారా లోకేష్.
అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను గుర్తుపెట్టుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి ఒక్కరి లెక్క సరిచేద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కూడా పార్టీ క్యాడర్ కు వైసీపీ బాధితులకు భరోసా ఇచ్చారు. తనను అన్యాయంగా జైలుకు పంపి తన 40 ఏళ్ళ రాజకీయ జీవితానికి చెరగని మచ్చ వేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి వారికి సహకరించిన ప్రతి అధికారి మీద విచారణ ఉంటుందనే నమ్మకాన్ని ఇచ్చారు బాబు.
అనుకున్నట్టే ప్రజలు వైసీపీ పార్టీని ఛీ కొట్టి కూటమి పార్టీకి జై కొట్టారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాటను, పార్టీ క్యాడర్ కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది. ఇప్పటికి వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది అనేలా వైసీపీ నాయకుల నోర్లు ఏమాత్రం ముఠా పడడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకుడు చేసిన చిన్న పొరపాటును కూడా వారు ఎక్కువగా ఫోకస్ చేసి ప్రజల ముందు వారిని దోషిగా నిలబెట్టారు.
2 లక్షల విలువ చేసే ఫర్నిచర్ ను దొంగలించిన దొంగ కోడెల శివ ప్రసాద్ అంటూ ఆయనను అవమానించి చివరికి ఆయన చనిపోయే వరకు వేధించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక దాదాపు 35 లక్షల విలువ చేసే ఫర్నిచర్ జగన్ తాడేపల్లి ప్యాలస్ లో ఉంచుకున్నా, 500 కోట్లతో ఋషి కొండ మీద విలాసవంతమైన ప్యాలస్ లు నిర్మించుకున్నా కనీసం చర్యలు తీసుకోలేకపోయారు.
అధికార పార్టీ మీద ఒక చిన్న విమర్శ చేసిన, వారి అధినేతను ఒక్క ప్రశ్న వేసిన ఉపేక్షించేది లేదని కేసులు పెట్టి వేధించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అదే నోటి దూల వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనితో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వమా.? వైసీపీ ప్రభుత్వమా.? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
జగన్ నుంచి పేర్నినాని వరకు ఎవ్వరికి ఇంకా అధికారం పోయిన అహంకారం పోలేదు. సొంత పార్టీ కార్యకర్తలే జగన్ కు వ్యతిరేకంగా నినదిస్తున్న వైసీపీ నేతలకు ఇంకా తత్త్వం బోధపడలేదు. ఈ నోటి దురుసుతోనే అధికారానికి దూరమైన ఆ వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ ప్రజల తీర్పును గౌరవించకుండా జగన్ అధికార పార్టీకి, స్పీకర్ కు డిమాండ్లతో కూడిన లేఖ రాసారు.
జగన్ చేసిన తప్పులు మోయడానికి నా జీవితం అనుకున్న పేర్నినాని మీడియా ముందుకు వచ్చి జగన్ ప్యాలస్ ల పిచ్చిని వెనకేసుకొస్తూ,చంద్రబాబు పై మళ్ళీ నోరు పారేసారు. నన్ను తిడితే మా పార్టీ క్యాడర్ కు బీపీలు వస్తాయి.., అలా వస్తే ఎంతటి విధ్వంసానికైనా వెనకాడరు అంటూ హింసను ప్రోత్సహించిన జగన్ ఇప్పుడు తన నేతలను మీడియా ముందుకు పంపి ఎవరిని రెచ్చకొట్టాలని చూస్తున్నారు.? ఎవరికీ బీపీ లు రావాలని కోరుకుంటున్నారు.?
జగన్ మాదిరే బాబు కూడా మా పార్టీ క్యాడర్ కు బీపీలు వచ్చాయి మీ పార్టీ నేతల మీద దాడులు చేస్తారు అంటూ ఒక్క ప్రకటన చేస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏమిటి.? పదవి పోయిన, ప్రభుత్వం మారిన వైసీపీ నేతల బుద్ది మారడం లేదు. బాబు, పవన్ లు కూడా గతంలో మాదిరే జగన్ ను, వైసీపీ ని తక్కువ అంచనా వేసి వారి మానానికి వారిని వదిలేస్తే మళ్ళీ జగన్ తన కుయుక్తులకు పదును పెట్టడం ఖాయం.






