వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేకపోతోందని ఎవరన్నారు?ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈ నెల 3న హైదరాబాద్లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైనప్పుడు, సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి, పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేశారట!
కానీ ఆయనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని వైసీపీ నేత ఒకరు ముందే హెచ్చరించారు కనుక ఈవిషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
అరెస్ట్, విడుదల అంటే సీబీఐ ఆయన చేతిలో ఓ కాగితం పెట్టినప్పుడు, అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు రెండు పూచీకత్తులకు సంబందించి కాగితాలు సీబీఐ అధికారుల చేతిలో పెట్టడం అన్నమాట! అంటే పేపర్ వర్క్, పేపర్ల మీద అరెస్ట్ అన్నమాట!
ఇక మరో రహస్య విషయం కూడా సీబీఐ బయటపెట్టింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి ఏ-8 నిందితుడుగా పేర్కొంది! ఈ కేసుతో అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబందం లేకపోయినా ఆయనను సీబీఐ పదేపదే విచారణ పేరుతో మానసిక క్షోభకు గురిచేస్తోందని, ఈ కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడని ఎక్కడా పేర్కొలేదని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్న సంగతి తెలిసిందే.
సీబీఐ ఏమి చేయలేదో, ఏమి చేయాలో కూడా వారే చెపుతున్నారు కనుక అదే చేసింది. నిందితుడుగా చేర్చేసింది. కానీ అంత మాత్రాన్న ఇంకా ఏదేదో చేసేస్తుందని ‘గిట్టనివాళ్లు’ ఊహించుకోనవసరం లేదు. అంతా యధాప్రకారమే సాగుతుందని పేపర్ మీద అరెస్ట్, విడుదలతో స్పష్టం చేసింది.
ఇక ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపినప్పుడు, బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఆయనకు బెయిల్ ఇవ్వొదని వాదించిన సీబీఐ, అదే కేసులో ఏ-8 నిందితుగా పేర్కొన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎందుకు విడిచిపెట్టేసింది అని ‘గిట్టనివాళ్ళ’కి ధర్మసందేహం రావచ్చు.
అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడే, ఒకవేళ అరెస్ట్ చేస్తే వెంటనే పూచీకత్తులతో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. లేకుంటే సీబీఐ ఆయనను నిజంగానే అరెస్ట్ చేసి ఉండేది.
ఇక వివేకాని హంతకులు చుట్టుముట్టి గొడ్డలితో హత్య చేస్తున్నప్పుడే ఆయన కాగితం, పెన్ను వెతికి తెచ్చుకొని ఓ లేఖ వ్రాసారని, కానీ ఆ లేఖను సీబీఐ పట్టించుకోకుండా పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లు దస్తగిరిని, గూగుల్ టేకవుట్లతోనే ఈ కధ మొత్తం నడిపించేస్తోందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు, ఆత్మసాక్షి, సజ్జల వంటి న్యాయనిపుణులు కోర్టు బయట వాదిస్తున్నారు.
ఈ విషయంలో కూడా సీబీఐ ఏం చేయలేదో, ఏం చేయాలో వారు పదేపదే గుర్తుచేస్తుండటంతో, ఆ లేఖకు సీబీఐ నిన్హైడ్రిన్ పరీక్ష చేయిస్తోంది. తద్వారా ఆ లేఖపై వివేకావి కాకుండా ఇంకా ఎవరెవరి వేలు ముద్రలు ఉన్నాయో కనుక్కోగలమని సీబీఐ చెప్పింది. “ఓ పక్క హంతకులు గొడ్డలితో నరుకుతుంటే ఎవరైనా పెన్ను, కాగితం వెతికి తెచ్చుకొని లేఖ వ్రాయగలరా?” అని ఆనాడు జగన్మోహన్ రెడ్డే అడిగారు. దానికి సీబీఐ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు చెపుతుందేమో?
అంతా పద్దతిగానే జరుగుతోంది కనుక భవిష్యత్లో ఏదో ఓ రోజు సీబీఐ తప్పకుండా “హూ కిల్డ్ బాబాయ్?” అనే నారా లోకేష్ ప్రశ్నకు కూడా తప్పకుండా సమాధానం చెపుతుంది. అంతవరకు గిట్టనివాళ్ళు, సునీతారెడ్డి కాస్త ఓపిక పట్టాలి… తప్పదు!



