ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ రాజకీయంగా ఒంటరివారుగా మిగిలిపోయారు. అయితే ఈ విషయంలో ఇద్దరి మద్య చాలా తేడా ఉంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్నప్పుడు దేశంలో అన్ని పార్టీలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించారు. అయితే వాటికి తానే నాయకత్వం వహించాలనే దురాశ కారణంగా ఎవరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదు. అదే… కేసీఆర్ వాటన్నితో కలిసి పనిచేయడానికి సిద్దపడి ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి మరోలా ఉండేది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం బిఆర్ఎస్ పార్టీకి మజ్లీస్ మిత్రపక్షంగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నికలలో ఆయన వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని విజయం సాధించారు.
ఆ తర్వాత శాసనసభ ఎన్నికలలో ఆయన వామపక్షాలను పక్కన పడేస్తే, ఓటమి తర్వాత ఓవైసీలు ఆయనను పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డితో అంటకాగడం మొదలుపెట్టారు.
శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా లోక్సభ ఎన్నికలలో పొత్తు పెట్టుకొనేందుకు తెలంగాణ బీఎస్పీ ముందుకు వచ్చింది. కానీ ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దాంతో కేసీఆర్ తెలివిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్కి ఎంపీ టికెట్ ఆఫర్ చేసి పార్టీలో చేర్చేసుకున్నారు.
మొత్తంగా చూస్తే కేసీఆర్ ఇతర పార్టీలతో పొత్తులకు ప్రయత్నించారని, కానీ వేర్వేరు కారణాల వలన ఆయన రాష్ట్రంలో, దేశ రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారని స్పష్టమవుతోంది.
కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో రాష్ట్ర రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు. అయితే ఆయన కేసీఆర్లాగ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని అనుకోకుండా ఏపీకే పరిమితం అవడం వలన ఆ మేరకు పరువు కాపాడుకున్నారు. కానీ ఏపీలో మాత్రం ఒంటరిగానే మిగిలిపోయారు.
ఈ రాజకీయ ఒంటరితనం జగన్ను లోలోన చాలా బాధిస్తుండవచ్చు. కానీ పైకి అది చెప్పుకోలేరు కనుక పులి, సింహం, తోడేళ్ళు, అర్జునుడు, పద్మవ్యూహం, కురుక్షేత్రం అంటూ ఏదేదో చెప్పుకొంటున్నారు. అడవిలో సింహం ఒంటరిగా పోరాడుతున్నందుకు బాధ పడదు. శత్రువులను ఎలా చీల్చి చెండాడాలని మాత్రమే ఆలోచిస్తుంది. కానీ తనను తాను సింహం, పులిగా అభివర్ణించుకునే జగన్ తాను ఒంటరిగా మిగిలిపోయానని పైన దేవుడిని, రాష్ట్రంలో ప్రజలనే నమ్ముకున్నానని చెప్పుకొని బాధపడుతుంటారు.
నియంతృత్వ పోకడలున్న కేసీఆర్ కూడా ఏదో సమయంలో ఏదో ఓ పార్టీతో దోస్తీ చేశారు. లేదా ఏదో ఓ పార్టీ ఆయనతో దోస్తీ చేసింది. కానీ జగన్ ఏ పార్టీతో ఎందుకు కలవలేకపోతున్నారు? ఏ పార్టీ కూడా ఆయనతో కలిసి పనిచేసేందుకు కనీసం ఆసక్తి కూడా చూపడం లేదు… ఎందువల్ల? అంటే కారణాలు అందరికీ తెలుసు.
కారణాలు ఏవైనప్పటికీ రాష్ట్రంలో జగన్ రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయారు కనుకనే టిడిపి, జనసేనల పొత్తులను, వాటితో బీజేపీ పొత్తులను, అవి కలిసి పోటీ చేస్తుండాన్ని జగన్ సహించలేకపోతున్నారని చెప్పవచ్చు.
రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వైసీపితో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడకపోవడం, అవన్నీ పొత్తులు పెట్టుకొని కలిసి పోటీ చేస్తుండటం వాటి తప్పు కాదు. తన తప్పే అని అంగీకరించలేకపోతున్న జగన్ వాటిని తప్పు పడుతూ, రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోవడానికి గొప్పగా కవరింగ్ ఇచ్చుకుంటూ తీవ్ర అసహనం, అశాంతితో ముందుకు సాగిపోతున్నారని అనుకోవచ్చు.




