ఇదివరకు వైసీపిలో రోజా, అంబటి, కొడాలి నాని ఇంకా చాలా మంది మాట్లాడేవారు. అయితే వారందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను అవహేళన చేసే, జగన్ భజన చేసే స్పెషలిస్టులు మాత్రమే. కనుక వారు విధానపరమైన అంశాల గురించి మాట్లాడేవారు కారు. వాటి కోసం వైసీపిలో ఓ స్పెషలిస్ట్ ఉండేవారు. ఆయనే సజ్జల రామకృష్ణా రెడ్డి.
విశాఖ రాజధాని మొదలు వివేకా హత్య కేసు వరకు ఎటువంటి ముఖ్యమైన అంశాలపైనైనా ఆయనే మాట్లాడేవారు. జగన్ చెప్పాలనుకున్న విషయాలు ఆయనే చెప్పేవారు. పనిలో పనిగా జగన్కు శల్య సారధ్యం కూడా చేస్తుండేవారు.
ఈసారి 175 సీట్లు మనకే అంటూ జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలకు కళ్ళకు గంతలు కడితే, జగన్కు సజ్జల గంతలు కట్టారని చెప్పవచ్చు.
మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా సజ్జల రామకృష్ణా రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు చెప్పి వెళ్ళిపోయినప్పటికీ జగన్ మేల్కోలేదు. సజ్జలనే నమ్ముకుని నిండా మునిగారు.
బహుశః ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందో ఏమో… ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డిని పక్కనపెట్టిన్నట్లు సమాచారం. శాసనసభలో జగన్కు ప్రతిపక్షనేత హోదా, రాష్ట్రంలో వైసీపి కార్యాలయాలకు నోటీసులు, జగన్ సెక్యూరిటీ తదితర అంశాలపై మీడియాలో వస్తున్న వార్తలు, టిడిపి నేతల విమర్శలకు పేర్ని నాని చేత జవాబులు చెప్పించడం చూస్తే జగన్మోహన్ రెడ్డి సజ్జలని పక్కన పెట్టిన్నట్లే అనిపిస్తుంది. ఇది నిజమా కాదా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార మదం కళ్ళని కాటరాక్ట్ పొరలా కప్పేసింది కనుక జగన్ తన చుట్టూ ఉన్నవారిలో భజన బృందాలను, శ్రేయోభిలాషులను గుర్తించలేకపోయారని సరిపెట్టుకోవచ్చు.
కానీ ఓటమి తర్వాత అయినా శ్రేయోభిలాషులను గుర్తించగలరా?తనను తాను సమూలంగా ‘ప్రక్షాళన’ చేసుకోగలరా? అంటే ఆయన మాటలు, ఆలోచనలు, లేఖలు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి.






