వినరా వినరా… జగన్ గారి వరాలు…!

YS Jagan False Promises in Praja Sankalpa Yatraవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తన పాదయాత్ర 8వ రోజున వరాల వర్షం కురిపించారు. ఈ ఎనిమిది రోజుల్లో 100 కిలోమీటర్ల మైలురాయిని తాకిన జగన్ యాత్ర, కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడంతో, ఉప్పొంగిన ఉత్సాహంతో పలు నూతన పథకాలను ప్రకటిస్తూ, తన పార్టీ అధికారంలోకి వస్తే, అన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు.

ADVERTISEMENT

ప్రతి గ్రామంలో ఓ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని, పెన్షన్, రేషన్, ఇల్లు సహా అన్ని పథకాలనూ ఆ సచివాలయం కేంద్రంగా పూర్తి పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. ఏ పథకం కోసమైనా దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో కనీసం పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఆ ఉద్యోగాల్లో ప్రతి సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఉంటుందని అన్నారు.

కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుండా, అర్హత ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు లభిస్తాయని మాట ఇచ్చారు. జన్మభూమి కమిటీలు లంచాల కమిటీలుగా మారిపోయాయని విమర్శించిన జగన్, ఇటువంటి కమిటీలతో ఇకపై అవసరం ఉండదని అన్నారు. ఏ నేత పాలనలోనైనా రాష్ట్రం నాలుగడుగులు ముందుకు నడిచి అభివృద్ధి దిశగా సాగుతుందని, చంద్రబాబు హయాంలో మూడడుగులు వెనక్కి వెళుతోందని నిప్పులు చెరిగారు.

కేసీ కెనాల్ కింద రాజోలి ప్రాజెక్టుకు వైఎస్ఆర్ 650 కోట్లు నిధులు కేటాయిస్తే, ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, వైకాపా అధికారంలోకి వస్తే, ఆ ప్రాజెక్టును పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. పేదల పింఛన్ ను 2 వేలకు పెంచుతామని, పింఛన్ వయసును కూడా 45 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపారు. ఫైనల్ గా తనకు ప్రజల ఆశీస్సులు కావాలని, నన్ను ముఖ్యమంత్రిని చేయమని వేడుకున్నారు.

అధికారంలోకి రాగానే “శివాజీ” సినిమాలో రజనీకాంత్ మాదిరి ఒక్కసారిగా రాష్ట్ర రూపురేఖలు, ప్రజల స్థితిగతులు మార్చేస్తానని చెప్తున్న జగన్ మాటలు వినడానికి బాగుంటాయేమో గానీ, ఆచరణకు అసాధ్యం అని చెప్పవచ్చు. అందులోనూ ప్రజలను మరింత సోమరులుగా తయారు చేసే విధంగా 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పడం, జగన్ అధికార దాహానికి అద్దం పడుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories