సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. తాడేపల్లి నుంచి సిఎం జగన్ బటన్ నొక్కుడుకి బయలుదేరితే ముందుగా ఆ జిల్లా వైసీపీ నేతలు అధినేతకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీ బ్యానర్లు సిద్దం చేసుకొంటుంటే, పోలీసులు పరదాలు సిద్దం చేసుకోవలసి ఉంటుంది.
సిఎం పర్యటన అంటే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా గ్రూపులకు చేతినిండా పనే! సిఎం సభకు రాకపోతే పింఛన్లు, సంక్షేమ పధకాలు నిలిపివేస్తామనో లేదా మరోటో చెప్పి జనాలను బలవంతంగా తరలించాలి. అయినా వస్తారో లేదో అనే అనుమానంతో ఆ సమయంలో విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయడం చాలా కామన్ అని మహిళలు చెపుతుంటారు. సభకు ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు డుమ్మా కొడుతున్నారో తెలుసుకొనేందుకు వాలంటీర్లు కొత్తగా అటెండన్స్ పద్దతి కూడా ప్రవేశపెట్టారు!
సిఎం పర్యటిస్తే స్కూళ్ళకు సెలవిచ్చేసి బస్సులు అప్పగించాల్సి ఉంటుంది. అవసరమైతే జగన్ మావయ్యకి స్వాగతం చెప్పేందుకు విద్యార్థులను అందించాలి. సందర్భాన్ని బట్టి వేదికపై అమెరికన్ ఎసెంట్లో మావయ్య గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పడానికి వారి చేత ముందుగానే బట్టీ వేయించాలి.
సిఎం పర్యటనకు పోలీసులే భద్రత కల్పించాల్సి ఉంటుంది కనుక దారిపొడవునా పోలీసులను మోహరిస్తే సరిపోదు. రోడ్డు పక్కన ఉన్న పచ్చటి చెట్లను నరికేసి భద్రత కల్పించడం లేటస్ట్ ట్రెండ్! చెట్లు నరికించేసి సిఎం సభకు పోలీసులు భద్రత కల్పించామని చేతులు దులుపుకొంటే సరిపోదు. సభకు వచ్చిన జనాలు మద్యలో గోడలు, గేట్లు దూకి పారిపోకుండా కాపలాకాయక తప్పదు.
ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం మిగిలి ఉండగా అప్పుడే ఒంటరయిపోయిన సింహం… తనపై తోడేళ్ళ గుంపు దాడికి వస్తోందంటూ చెప్పే పంచతంత్రం కధలు వింటూ, సందర్భానుసారం చప్పట్లు కొట్టాల్సిన బాధ్యత జనాలకు, వారిని సమీకరించినవారికీ ఉంటుంది.
ఇన్ని సిత్రాలు సరిపోవన్నట్లు తాజాగా దీనికి మరో సిత్రం జోడించారిప్పుడు. అదే… సిఎం హెలికాఫ్టర్లో సభకు వెళుతుంటే కిందన రోడ్డుపై వాహనాలు నిలిపివేయడం! అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు వీళ్ళకి ఎలా వస్తాయో అని జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
కానీ జనసేనకు లాజిక్ అర్దమైన్నట్లు లేదు. అందుకే “సిఎం గాల్లో ప్రయాణిస్తుంటే హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి?” అంటూ తాటికాయంత అక్షరాలతో హెడ్డింగ్ పెట్టి, సోషల్ మీడియాలో పెద్ద లేఖ విడుదల చేసింది. సిఎం జగన్ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్లో విజయనగరం జిల్లాలోని భోగాపురానికి వెళుతుంటే, అటు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వద్ద, శ్రీకాకుళం జిల్లాలోని పలాస వద్ద పోలీసులు వాహనాలు నిలిపివేయడం ఏమిటి? పోలీసుల అత్యుత్సాహం వలన భోగాపురం హైవేకు అటూఇటూ 150 కిమీ దూరాన్న వాహనాలు ఎందుకు నిలిపివేశారంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.



