ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడుని లోపల వేసి, నారా లోకేష్తో సహా అందరిపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ బిజీగా ఉంచి ప్రజల మద్యకు వెళ్ళకుండా చేస్తే, వైసీపి సులువుగా గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగలదని వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావించి ఉండవచ్చు.
అయితే తానొకటి తాలిస్తే దేవుడు మరొకటి తలిచిన్నట్లు ఆయన ఏమేమి జరగకూడదనుకొన్నారో వాటిని ఆయన నమ్ముకొన్న దేవుడు ఆయన చేతే చేయిస్తుండటం విశేషం.
చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఒకటి ఆశిస్తే దాంతో వెంటనే టిడిపి, జనసేనల పొత్తు కుదిరింది. కష్టకాలంలో స్నేహితులు ఎవరో, రాజకీయ శత్రువులు ఎవరో టిడిపికి బాగా తెలిసి వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్ల తెలంగాణ సిఎం కేసీఆర్లో ఎటువంటి మార్పు లేదని టిడిపి గ్రహించగలిగింది. బహుశః అందుకే తెలంగాణ ఎన్నికలలో టిడిపి తన వ్యూహం అమలుచేస్తోందని భావించవచ్చు.
ఈ కేసులు, అరెస్టుల పుణ్యమాని ఈ రెండు-మూడు నెలల్లో టిడిపి బలాలు, బలహీనతలను గుర్తించుకోగలిగింది. వైసీపి కక్ష సాధింపులను లైట్ తీసుకోరాదని, వాటి కోసం అది ఎంత దూరమైనా వెళుతుందని టిడిపి గ్రహించింది. కనుక ఇకపై మరింత అప్రమత్తంగా ఉండేలా చేసింది. ఈ న్యాయపోరాటాలు టిడిపికి అనేక గుణపాఠాలు నేర్పి ఉండవచ్చు. నారా లోకేష్ నాయకత్వ లక్షణాలు మరింత స్పష్టమయ్యాయి.
చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టి ఆయనపై అవినీతి ముద్రవేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తే, ప్రజలకు ఆయనపై సానుభూతి పెరిగింది. ఇది టిడిపికి మేలు చేయబోతోంది.
చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం తెలంగాణ రాజకీయాలపై, ఎన్నికలపై కూడా పడుతుందని జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండరు. అదీ… కేసీఆర్కు ఎంతో కీలకమైన తెలంగాణ ఎన్నికలకు ముందు ఈవిదంగా చేయడంతో కేసీఆర్కు ఆగ్రహం, అసహనం కలిగి ఉండవచ్చు. ఇప్పుడు పైకి చెప్పకపోయినా ఒకవేళ ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే అప్పుడు వైసీపికి సహకరించకుండా దూరంగా ఉండిపోవచ్చు.
మూడు నెలల విరామం తర్వాత మళ్ళీ తమ మద్యకు వస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు ప్రజలు బ్రహ్మరధం పట్టడం ఖాయం. చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆయన అవినీతికి పాల్పడలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ఇదే విషయం గట్టిగా చెప్పుకోవడం తధ్యం. కనుక చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతోనే వైసీపి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ప్రజలకు నమ్మకం కలిగితే నష్టపోయేది వైసీపియే అని వేరే చెప్పక్కరలేదు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే వైసీపి అధినేత జగన్ ఏమి జరగాలనుకొన్నారు?కానీ ఏమి జరిగిందో చూస్తే డామిట్ కధ అడ్డం తిరిగిందనిపించక మానదు. దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉందేమిటి?అని చేతులు పిసుక్కోక తప్పదు.




