ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి హప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు వైఎస్ జగన్, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్లు హాజరు కాగా.. వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాంలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ పార్టీ నేతల సమక్షంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే షర్మిలకు అనారోగ్యమంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ను కనీసం ఆహ్వానించకపోవడం విశేషం.
జగన్ అధికారంలోకి వస్తే అమరావతి నుండి రాజధానిని తరలిస్తారని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జగన్ అమరావతిలో ఇల్లు, కార్యాలయం నిర్మించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో కృష్ణ, గుంటూరు జిల్లాలలోని ప్రజల అనుమానాలు దూరం అవుతాయని వారు భావిస్తున్నారు. అమరావతిలో స్థిరనివాసం ఉన్న ఒకే ఒక్క ప్రధాన పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రమే. ఎన్నికల వరకు జగన్ ఇక్కడి నుండే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోనున్నారు. అవసరమైనప్పుడు హైదరాబాద్ వెళ్లి వస్తారు.



