సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన పధకానికి బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పంచతంత్రంలోని ఓ కధని చెప్పారు. వేటాడేశక్తి కోల్పోయిన ఓ ముసలి పులి దారినపోయే వారికి తన వద్ద ఉన్న ఓ బంగారు కంకణాన్ని ఆశజూపి చంపి తినేసేదని, చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కొన్ని గుంటనక్కలను వెంటబెట్టుకొని వస్తున్న ఆయనను ఎవరూ నమ్మొద్దని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మేలు చేస్తోందని కనుక వచ్చే ఎన్నికలలో తనకు అండగా నిలబడి వైసీపీని మళ్ళీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పంచతంత్రం కధను జగన్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అన్వయించి చెప్పినప్పటికీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తీరు, ఈ నాలుగేళ్ళలో జరుగుతున్న అకృత్యాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ఈ కధ చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డికే నూటికి నూరు శాతం సరిపోతుందనిపిస్తుంది.
2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం, మళ్ళీ గుండెపోటును హత్యగా అభివర్ణించి దానిని చంద్రబాబు నాయుడుకి అంటగడుతూ ఎన్నికలలో లబ్ది పొందడం, హత్యారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని నేటికీ గట్టిగా వెనకేసుకు రావడం వంటివన్నీ పంచతంత్రం కధనే గుర్తుకు తెస్తున్నాయి కదా?అయితే పంచతంత్రం కధలో పులి ముసలిది… వైసీపీ అధినేత యువసింహం… అంతే తేడా!
మొదట బాబాయ్, తర్వాత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ, ఇప్పుడు మరో చెల్లి సునీతారెడ్డి, బావ రాజశేఖర్ రెడ్డి, చివరికి సొంత ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులు, మెడపట్టి బయటకు గెంటేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు అందరూ జగనన్న బాధితులే కదా?ఈరోజు సభలో ఓ చెల్లి అడిగిందని జిల్లాకు నాలుగు వంతెనలు మంజూరు చేసేస్తున్నట్లు జగనన్న ప్రకటించారు. కానీ వరుసకు చెల్లి అయిన సునీత రెడ్డిని ఆస్తికోసం సొంత తండ్రినే చంపిన ఓ హంతకురాలిగా చిత్రీకరిస్తున్న మాట వాస్తవం కాదా?
ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే 5 ఏళ్ళ తర్వాత అంటే… 2024లో జరుగబోయే ఎన్నికలలో ఓట్ల కోసం సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచిపెడుతుండటం, మళ్ళీ ఆ భారం పన్నులు, కరెంటు ఛార్జీల రూపంలో వారిపైనే వేస్తుండటం, అమరావతే మన రాజధానని చెప్పిన నోటితోనే విశాఖే మన రాజధాని అని చెప్పడం, మూడు రాజధానులని నాలుగేళ్ళు కాలక్షేపం చేసి విశాఖ ఒక్కటే రాజధాని అని చెపుతుండటం వంటివాటి గురించి ఎంత చెప్పుకొన్నా తరగవు… చెప్పుకొంటూపోతే ఈలోగా ఎన్నికలొచ్చేస్తాయి.



