ఒక నాయకుడిగా నిలబడాల్సి వచ్చిన ప్రతి సమయంలోనూ వైకాపా అధినేత జగన్ పూర్తిగా విఫలమవుతున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ వ్యాఖ్యలు దాదాపు గత మూడు, నాలుగేళ్ళుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏదొక సందర్భంలో తనలోని ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా ఎదుగుతారు అని ఎదురుచూసే వారికి ప్రతిసారి నిరాశనే మిగులుస్తున్నారు జగన్.
ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు ఉన్న పళంగా పార్టీలో సంక్షోభం మొదలైంది. పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ‘పసుపు’ జెండా కప్పెసుకున్నారు. అంతేకాదు, ఈ రంగు జెండా కోసం మాతో పాటు వచ్చేవారు చాలా మంది ఉన్నారు, కొన్నాళ్ళు వేచిచూడండి అంటూ మీడియా ముఖంగా ప్రకటన కూడా చేసేసారు. దీంతో ఎవరి పేర్లు ఎప్పుడు తెరపైకి వస్తాయోనని మీడియా వర్గాలతో పాటు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
పార్టీ ఈ స్థితిలో ఉంటే, ఏ రాజకీయ నాయకుడైనా ముందుగా తానూ ఉన్న పర్యటనను రద్దు చేసుకుని ముందుగా పార్టీ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పార్టీని వీడిపోయిన ఎమ్మెల్యేల ప్రస్తావనలు పక్కన పెట్టినా, ప్రస్తుతం పార్టీలో ఇంకా ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాగే పార్టీ మార్పు విషయంలో ఉదంతంలో వస్తున్న వారితో ప్రత్యేక చర్చలు జరిపి, వారికి పార్టీపై విశ్వాసం కలిగించాలి. కానీ, జగన్ కు ఆ నాయకత్వ లక్షణాలు పూర్తిగా కొరవడినట్లు మరోసారి స్పష్టమైందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. లేదంటే మిగతా సభ్యులు కూడా జగన్ పై “తిరుగుబాటు” ప్రకటించడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.



