పిన్నెల్లి అరెస్ట్ నేపథ్యంలో నెల్లూరు జైలుకు పరామర్శకు వెళ్లిన జగన్ కు ఒక్కసారిగా జైలు వాతావరణం చూడగానే ములాఖత్ లతో తనకున్న అవినాభావ సంబంధం గుర్తుకొచ్చినట్టుగా ఉంది. మనిషిలో కంగారు, మాట లో తడబాటు స్పష్టంగా కనిపించేలా జగన్ ప్రవర్తన శైలి కనిపించింది.
ప్రజాస్వామ్యాన్ని కూల్చినట్టుగా ఈవీఎం లను పగలకొట్టిన తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నేల్లిని జగన్ వెనకేసుకొచ్చిన తీరుకు అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. పిన్నెల్లి ఈవీఎం లను ధ్వంసం చేసినట్టుగా వీడియో లు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనపడుతున్నా ఇంకా తన పార్టీ నేత బాధితుడిని, తానూ ఒక అమాయకుడని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే పిన్నెల్లి పై తప్పుడు కేసులు మోపిందంటూ తలతోక లేని ఆరోపణలు చేస్తున్నారు జగన్.
హత్యలు చేసిన వారిని, దాడులకు పాల్పడిన వారిని, హింసను ప్రోత్సహిస్తున్న వారిని, సమాజానికి బూతులు నేర్పిస్తున్న వారిని ఇలా వెనకేసుకు రావడం వల్లనే 151 సీట్లతో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యింది అనే సత్యాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహించలేకపోవడం నిజంగా వైసీపీ పార్టీకి చేటు చేసినట్లే అవుతుంది. తన సొంత బాబాయ్
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన చిన్ని తమ్ముడు అవినాష్ రెడ్డి ని ఈ మాదిరే వెనకేసుకొచ్చారు జగన్.
అలాగే ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన తన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ను తన చుట్టూ తిప్పుకుంటూ దళితులకు తానూ చేసిన అన్యాయమేమిటో ప్రతి నిముషం ఆ వర్గానికి గుర్తు చేస్తూనే ఉన్నారు జగన్. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ అసభ్యకర వీడియో తో అడ్డంగా దొరికి పోతే అది మార్ఫింగ్ వీడియో అంటూ, ప్రతిపక్షాల కుట్ర అంటూ గోరంట్లకు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మద్దతుగా నిలబడ్డారు.
ఇవన్నీ గత ఐదేళ్లుగా జగన్ చేసిన ఘోరాలకు మచ్చుతునకలు మాత్రమే. వైసీపీ పతనానికి విశ్లేషణ మొదలుపెడితే ఈ ఐదేళ్ల సమయం సరిపోతుంది. జగన్ అధికారంలో ఉన్నపుడు వైసీపీ మీద కానీ వైసీపీ నేతల మీద కానీ ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాల కుట్ర అంటూ సమర్ధించుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో ఇది ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలు అంటూ అన్యాయానికి వంత పాడుతున్నారు.
ఇలా తప్పుచేసిన నాయకులను సమర్థిస్తూ తానెందుకు ఓడిపోయానో తెలియడం లేదు అని బాధపడడం కానీ, కూటమి పార్టీలు ఎందుకు గెలిచాయి అని ఆలోచించడం కానీ జగన్ కు వ్యర్థ ప్రయాసే అవుతుంది. అయితే చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్న ఒక్కో వైసీపీ నేత జైలు పాలవ్వడంతో గత పదేళ్ల నుండి బెయిలు మీద ఉన్న తన పరిస్థితి ఏమిటో అన్న ఆలోచనలోకి జగన్ వెళుతున్నారా.?
గతంలో తన మీద ఉన్న ఈడీ, సిబిఐ కేసులతో పాటుగా గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు బయటకొస్తే జగన్ మరి కొన్ని కేసులు వెనకేసుకున్నట్టే. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి పోవడంతో తన పాత కేసులు మళ్ళీ విచారణకు సిద్దమయ్యాయి. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి హోదా అడ్డుపెట్టుకుని కేసుల విచారణకు హాజరుకాకుండా వస్తున్న జగన్ మళ్ళీ శుక్రవారమో, మంగళవారమో విచారణకు సిద్ధమవ్వాలి.
అలాగే ఇన్నాళ్లుగా తనకిచ్చిన బెయిలు మీద న్యాయస్థానం పునరాలోచనకు వెళితే ఇప్పుడు అదే జైలుకు జగన్ వెళతారు, అదే ములాఖత్ కు వైసీపీ నేతలు వెళ్లాల్సి ఉంటుంది. దీనితో జగన్ కు జైలు చూడగానే గతం గురుకొచ్చిందా.? లేక భవిష్యత్ కనిపించిందా.? అంటూ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కూటమి నేతలు.






