ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాలంటీర్లను పింఛన్లు చెల్లింపుకు ఉపయోగించరాదని ఎన్నికల సంఘం గత నెలలో ఆంక్ష విధించింది. అయితే మార్చి రెండో వారంలోనే ఈ ఆదేశం జారీ చేసినప్పటికీ జగన్ ప్రభుత్వం కుంటిసాకులతో ఏప్రిల్ నెలలో పింఛన్లు చెల్లింపు ఆలస్యం చేసింది.
అప్పుడు వృద్ధులను సచివాలయం చుట్టూ తిప్పించుకొని వారి కష్టాలకు చంద్రబాబు నాయుడే కారణమంటూ దుష్ప్రచారం చేసింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం గట్టిగా హెచ్చరించిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు చెల్లించింది.
గత నెలలో ఏవిదంగా పింఛన్లు చెల్లించిందో ఈ మే నెలలో కూడా అదేవిదంగా జరిపించి ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు పది రోజులు ముందుగానే ప్రభుత్వానికి పింఛన్ల సంగతి గుర్తు చేసినా, ఈ నెల కూడా ఇంత వరకు వృద్ధులు, వికలాంగులకు వారి ఇళ్ళ వద్ద పింఛన్లు చెల్లించలేదు. దీంతో మళ్ళీ ఈ నెల కూడా వృద్ధులు పింఛన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు.
గత నెలలో మొదటిసారిగా సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేయవలసి వచ్చింది కనుక కాస్త ఆలస్యం అయ్యింది. దానిని అర్దం చేసుకోవచ్చు. కానీ ఈ నెల కూడా పింఛన్లు ఆలస్యం చేస్తుండటంతో జగన్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా సమస్యను పొడిగిస్తోంది. తద్వారా చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించి ఎన్నికలలో టిడిపిని దెబ్బ తీయాలని యోచిస్తున్నట్లుంది.
చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి పింఛన్లు అందకుండా అడ్డుకున్నారని వైసీపి దుష్ప్రచారం చేస్తోంది. కానీ ఈ నెల పింఛన్లు చెల్లించకుండా జగన్ ప్రభుత్వానికి ఎవరు అడ్డుపడ్డారు? ఎందుకు ఆలస్యం చేస్తోంది. ఈ మండుటెండల్లో వృద్ధులను సచివాలయాల చుట్టూ ఎందుకు తిప్పించుకుంటోంది? ఈసారి ఆలస్యానికి జగన్ ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది కదా? వైసీపి రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులను కూడా వేధించడానికి వెనకాడదని ఇది స్పష్టం చేస్తోంది.
ఓ పక్క వృద్ధుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తూ, మళ్ళీ ఎన్నికల సభలో ‘నా అవ్వా తాతలు’ అంటూ తీయతీయగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికే చెల్లునేమో?




