ప్రభుత్వాలు పాలనా సౌలభ్యం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంటాయి. అందుకు కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటాయి. ఆ వ్యవస్థలే మరింత పటిష్టంగా మారే పరిస్థితి వస్తే ప్రభుత్వాలకు రెట్టించిన బలం వచ్చినట్లే అవుతుంది. కానీ ఆ వ్యవస్థను నడిపించడానికి ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుంటే ఏ మాత్రం ఆలస్యం లేకుండా కొన్ని కొత్త జి.ఓ లు పుట్టుకొస్తాయి. దానికి అసలు కారణం ఆ వ్యవస్థలో వారిని ఒక్కొక్కరిగా సాగనంపడానికే అనే వ్యాఖ్యలు విశ్లేషకుల నుండి వినబడుతున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితే తలెత్తిందనే వార్తలు మొదలయ్యాయి. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్లు వ్యవస్థనట. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా ఎలాంటి జాప్యం లేకుండా అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినదే వాలంటీర్ల వ్యవస్థ. సచివాలయ వ్యవస్థకి అనుబంధంగా పనిచేసేలా ఈ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం 2.67 లక్షల మంది వాలంటీర్ల పనిచేస్తున్నారు. వీరిని తొలగించాల్సిన పరిస్ధితి వస్తే ఎలాంటి విధి విధానాలను అనుసరించాలి అనే అంశంపై కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా వాలంటీర్లను తొలగించవచ్చంటూ జి.ఓ జారీ చేసింది.
వాలంటీర్ల పనితీరు ఆధారంగానే వారిని కొనసాగించాలా లేక తొలగించాలా అనేది నిర్ణయిస్తారని తెలుస్తుంది. వాలంటీర్లు ఎవరైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా, సమయపాలన పాటించకపోవడం, దురుసుగా ప్రవర్తించడం, నిర్లక్ష్యంగా ఉండటం లాంటివి చేస్తే వారిని సంబంధిత ఉన్నతాధికారులు తొలగించవచ్చని జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.
మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు ఎవరైనా వాలంటీర్ తప్పుచేస్తే వారికి షో కాజ్ నోటీసు ఇస్తారు. తరువాత వారి నుండి వచ్చిన వివరణ పై పంచాయితీ కార్యదర్శి విచారించి ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్ లకు రిపోర్ట్ చేస్తారు.
వాలంటీర్లను వాడుకున్నన్ని రోజులు వాడుకుని, తీరా అవసరం తీరాక ఏదో ఒక నెపంతో వారికి స్వస్థి పలకాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి మార్గదర్శకాలు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి ఇప్పటివరకు సేవలందించిన వారికి ఏదో విధంగా ముగింపు పలకాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం దురదృష్టకరమంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అవసరం ఉన్నంత వరకు ప్రేమని ఒలకబోస్తారు, తీరా అవసరం తీరాక తన్ని తరిమేస్తారు..కలికాలం అంటే ఇదే మరీ అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.



