జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని అవమానించడానికే శాసనసభ సమావేశాలన్నట్లు నిర్వహించేవారు.
తన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుని, రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశ్యించి శాసనసభలో నీచంగా మాట్లాడుతుంటే జగన్ ముసిముసినవ్వులు నవ్వేవారు.
అది చూసి మంత్రులు రోజా, అంబటి రాంబాబు, వైసీపి ఎమ్మెల్యేలు కొడాలి నాని వంటివారు మరింత చెలరేగిపోయేవారు.
ఆనాడు టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున నిబందనల ప్రకారం చంద్రబాబు నాయుడుకి ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వడం కుదరదని నిష్కర్షగా చెప్పేశారు.
కానీ ఇప్పుడు అంతకంటే తక్కువగా 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వకపోతే శాసనసభకు రాబోమని వితండవాదం చేస్తున్నారు.
కానీ జగన్ కుంటిసాకు చెపుతున్నప్పటికీ ఆయన శాసనసభ సమావేశాలకు మొహం ఎందుకు చాటేస్తున్నారో అందరికీ తెలుసు.
ఆనాడు శాసనసభలో తాము వ్యవహరించిన తీరు చాలా తప్పని జగన్, వైసీపి ఎమ్మెల్యేలందరికీ బాగా తెలుసు. కనుక శాసనసభకు వస్తే అంతకంటే దారుణమైన అవమానం తప్పదని తెలుసు. జగన్ అహం దెబ్బతింటే అసలు తట్టుకోలేరు.
ముఖ్యంగా జగన్ ఎంతగానో భయపడే, ద్వేషించే అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణరాజు స్పీకర్, డెప్యూటీ స్పీకర్గా ఉండగా శాసనసభలో అడుగుపెట్టడం అంటే బోనులో చిక్కుకున్నట్లే అని భావిస్తున్నారని అర్దమవుతూనే ఉంది. అయినా సింహంలా గర్జించిన, ఇంకా గర్జిస్తునే ఉన్న జగన్, వైసీపి ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇంతగా భయపడితే ఎలా?
అయితే జగన్ శాసనసభ సమావేశాలకు రాకపోయినా టిడిపి, జనసేన, బీజేపీ, షర్మిల చేసే విమర్శలకు జవాబు చెప్పుకోవడం చాలా కష్టమే.
తమ అధినేత జగన్ సిఎం చంద్రబాబు నాయుడుకి భయపడి శాసనసభలో అడుగుపెట్టకపోవడం చూస్తున్న వైసీపి శ్రేణులు సిగ్గుతో తలదించుకుంటుండగా, ప్రజల ముందు జగన్ తలదించుకోవలసివస్తుంది.
శాసనసభలో అవమానపడటం కంటే ప్రజలని మభ్యపెట్టడం తేలికని జగన్ అనుకుంటున్నట్లున్నారు.
కానీ ఐదేళ్ళపాటు శాసనసభ సమావేశాలకు జగన్ హాజరు కాకపోతే, ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఏం ప్రయోజనం?ఆ పదవికి రాజీనామా చేసి మరొకరికి అవకాశం కల్పించాలనే టిడిపి, జనసేన, బీజేపీ, షర్మిలల వాదనలతో ప్రజలు ఏకీభవించకుండా ఉంటారా?మొత్తంగా చూస్తే జగన్ శాసనసభకు వచ్చినా రాకపోయినా అవమానం, అప్రదిష్ట తప్పవు.






