ఎన్నికలనేవి ప్రజాభిప్రాయాన్ని లేదా ప్రజల తీర్పును చెప్పాలి. దానిని అన్ని రాజకీయ పార్టీలు శిరసావహించాలి. కానీ ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలని భావిస్తూ ఎన్నికలలో గెలిచేందుకు అధికార పార్టీ ఎంతకైనా తెగిస్తున్నప్పుడు ప్రత్యర్ధులు కూడా అందుకు తగ్గట్లుగా వ్యవహరించక తప్పడం లేదు.
ఉదాహరణకు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపిని నామరూపాలు లేకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉండి. వాటిలో భాగంగానే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనను ఓడించాలని జగన్ ‘టార్గెట్ కుప్పం’ పెట్టుకొని ప్రయత్నిస్తున్నారు.
అందుకోసం కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి హడావుడిగా ఓ రూ.60-70 కోట్లు నిధులు విడుదల చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ని నియమించి కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటించిన ప్రతీసారి ఇబ్బందిపెడుతున్నారు. ఎన్నికలలో టిడిపిని ఓడించాలను కోవడం సహజమే కానీ చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఓడించాలని రగిలిపోవడం దేనికి?వైసీపీ అధినేత జగన్ చెప్పే ప్రవచనాలకు, చేతలు ఎంత తేడా ఉందో అర్దం చేసుకొనేందుకు ఇదే ఓ చిన్న నిదర్శనంగా భావించవచ్చు.
వైసీపీ ఇటువంటి కక్షపూరితమైన విధానాలతో ముందుకు సాగుతోంది కనుకనే టిడిపి కూడా తప్పనిసరిగా వాటిని ఎదుర్కొని పోరాడక తప్పడంలేదు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్లు మెజార్టీతో గెలుపొందడమే లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
జగన్ సొంత జిల్లా కడపతో సహా రాయలసీమ జిల్లాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీని ధీటుగా ఎదుర్కొని దాని వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించిన టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఆ కమిటీకి ఛైర్మన్గా నియమించారు. దీనిలో గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు వరకు నియోజకవర్గం సమస్యలు, కులసమీకరణాలు, రాజకీయ బలాబలాలు తదితర అంశాలపై మంచి అవగాహన, పట్టు ఉన్న మొత్తం 31 మంది సభ్యులను నియమించి, అందరికీ తలో బాధ్యత అప్పగించారు. విశేషమేమిటంటే ఈ కమిటీలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పి. మనోహర్ని కూడా ఓ సభ్యుడిగా నియమించారు! వైసీపీ అధినేత ‘టార్గెట్ కుప్పం’ అంటూ చంద్రబాబు నాయుడుని ఓడించాలనే కసితోనే ఈ యుద్ధం ప్రారంభించారు కనుకనే ఆయన కూడా దానిని ఎదుర్కొనేందుకు ఈవిదంగా సన్నాహాలు చేసుకోవలసి వస్తోంది.
ఇప్పటి నుంచే ఈ కమిటీ గ్రామస్థాయి నుంచి పని మొదలుపెట్టి ఎన్నికల నాటికి కుప్పం నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించి వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకి లక్ష కంటే ఎక్కువ ఓట్లు సాధించేందుకు కృషి చేస్తుంది. ఇందుకోసం అవసరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొనేందుకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రజా సమస్యలను కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. కనుక వాటిని పరిష్కరించి నియోజకవర్గాలను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉండి ఉంటే, ఈ విదంగా కసితో ఎవరిపైనా యుద్ధం చేయవలసిన అవసరం లేదు కదా? అలనాడు పాండవులకు 5 ఊళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడని దుర్యోధనుడు కూడా ఇదేవిదంగా “కసితో యుద్ధం చేసి” చివరికి ఏమయ్యాడో అందరికీ తెలుసు.
కనుక ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ని సద్వినియోగం చేసుకొని వారిని మెప్పించలేకపోవడం వలననే సాధారణంగా జరగాల్సిన ఎన్నికలని కురుక్షేత్ర మహాసంగ్రామంగా మార్చేసుకొని ఒంటరిగా మిగిలిపోయానని జగన్ బాధపడుతుండటం అందరూ వింటూనే ఉన్నారు కదా?మళ్ళీ చంద్రబాబు నాయుడుని నిందించడమెందుకో అర్దం కాదు.



