ఎన్నికల ముంగిట ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే యెల్లో మీడియా అంటూ ఒక లిస్టు తయారు చేసుకున్న జగన్ ఇప్పుడు ఆ లిస్టులో ఉన్న టీవీ5 ని నిషేదించారు. ఆ టీవీ ఛానల్ ప్రతినిధులను తమ పార్టీ కార్యకలాపాలకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఆ ఛానల్ లో జరిగే చర్చా కార్యక్రమాలలో ఇక నుండి తమ పార్టీ తరపున ప్రతినిధులు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయించారు.
ఇప్పటికి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిని ఇదే రకంగా బ్యాన్ చేసింది. జర్నలిస్టు మూర్తి జాయిన్ అయ్యాక టీవీ5 తమ పట్ల మరింత వ్యతిరేకంగా తయారయ్యిందని జగన్ భావిస్తున్నారు. దీనితో ఈ చర్యకు పూనుకున్నారు. ఈ నిర్ణయాన్ని బహిరంగ పత్రికా ప్రకటన లో చెప్పడం విశేషం. గతంలో టీడీపీ కూడా సాక్షిని తమ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధించింది. ఎప్పటి నుండో ఆ ఛానల్ చర్చా కార్యక్రమాలకు టీడీపీ ప్రతినిధులు హాజరు కారు.
మాములు రోజులలో వాక్ స్వతంత్రం గురించి లెక్చర్లు ఇచ్చే పార్టీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం విశేషం. రెండు నెలలలో ఎన్నికలు జరగనుండడంతో మీడియా పాత్ర చాలా కీలకం కాబోతుంది. మీడియా ప్రజలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే వచ్చిన బార్క్ టీఆర్ఫీ రేటింగ్లలో టివీ 5 మూడవ స్థానంలో ఉండడం విశేషం. టివీ5 కంటే ముందుగా టీవీ9, ఎన్టీవీ మాత్రమే ఉన్నాయి. ప్రజాదరణ ఉన్న టీవీ ఛానల్ ను ఎన్నికల ముంగిట బ్యాన్ చెయ్యడం అనేది ఒక రకంగా సాహసమనే చెప్పుకోవాలి.



