వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న శాసనసభకు వచ్చి ప్రమాణస్వీకారాలు చేశారు. కానీ “శాసనసభలో మనకు బలం లేదు కనుక ఎలాగూ అక్కడ మనకు పని లేదని” జగన్ ముందే చెప్పేశారు కనుక నేడు శాసనసభ సమావేశాల రెండో రోజే మొహం చాటేసి పులివెందులకు వెళ్ళిపోయారు. ఆయన లేకుండా శాసనసభలో అడుగుపెట్టేందుకు వైసీపి ఎమ్మెల్యేలు సాహసం చేయలేరు. కనుక వారూ డుమ్మా కొట్టేశారు.
ప్రస్తుతం శాసనసభలో మిగిలిన ముగ్గురు టిడిపి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎన్నుకుంటారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేసినందున ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే అని చెప్పవచ్చు.
జగన్ పులివెందులలో 5 రోజులు మకాం వేసి కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుంటారు.
కానీ వైసీపి ఓటమికి కనీసం వంద కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా జగన్ స్వయంగా ఈవీఎంలు, ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించడం వలన కారణంగా ఓడిపోయామని తేల్చి చెప్పేసినప్పుడు మళ్ళీ జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించడం అవసరమా? అంటే చాలా అవసరమే అని చెప్పక తప్పదు.
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్టీలో ఢీలా పడిన నాయకులందరినీ మళ్ళీ పోగేసుకునేందుకు, పార్టీలో ఉండేవారు ఎవరో… బయటకు పోయేవారు ఎవరో తెలుసుకునేందుకు, రాబోయే రోజుల్లో టిడిపి ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేసి జైలుకి పంపించేందుకు ప్రయత్నిస్తే వాటిని ఏవిదంగా ఎదుర్కోవాలి?వంటి అనేక విషయాలు చర్చించుకోవలసి ఉంది.
ముఖ్యంగా వైసీపిలో అందరూ ఈ ఓటమిని జీర్ణించుకొని తేరుకునేందుకు కనీసం ఒకటి రెండు నెలలు సమయం పడుతుంది. కనుక అంతవరకు జగన్ కాలక్షేపం చేయడానికి ఈ సమీక్షా సమావేశాలు చాలా అవసరమే. ఆలోగా ప్రజలు కూడా వైసీపి ఓటమిని జీర్ణించేసుకుంటారు కనుక అప్పుడు జగన్ ఏదో పేరుతో పాదయాత్ర మొదలుపెట్టుకోవచ్చు.






