వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీలో చలనం వచ్చిన మాట వాస్తవం. ముందుగా పార్టీ నాయకులలో చలనం కలిగించగలిగితే తర్వాత ప్రజలలో కూడా చలనం కలిగించవచ్చని షర్మిల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
ఇక్కడ ఏపీలో, అక్కడ ఢిల్లీలో ‘ప్రత్యేక హోదా’ పేరుతో చేసిన హడావుడికి కాంగ్రెస్ నేతలు బాగానే పోగవుతున్నారు. అయితే ఆమె ఎంత హడావుడి చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదు. రాబోయే ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం ఆమెతో సహా ఆమె వెంట తిరుగుతున్నవారికి, ఏపీ ప్రజలకు కూడా తెలుసు.
చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాష్ట్రంలో తమ పార్టీలని బలపరుచుకోవడానికి ఏళ్ళ తరబడి చాలా శ్రమించారు. కానీ వైఎస్ షర్మిల జనవరి 21వ తేదీన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి కేవలం పది రోజులలోనే ఏపీ కాంగ్రెస్ని కళకళలాడించగలిగారు!
ముఖ్యంగా ఏపీ ప్రజలకు మొహం చూపించలేకపోతున్న కాంగ్రెస్ నేతలందరినీ మళ్ళీ బోర విరుచుకుని ప్రజల మద్యకు తిరగగలిగేలా చేశారు. కనుక ప్రత్యేకహోదా అనేది కాంగ్రెస్ నేతలు ఏపీలో తలెత్తుకుని తిరిగేందుకు ఓ ‘టూరిస్ట్ వీసా’ వంటిది మాత్రమే అని భావించవచ్చు.
అయితే వైఎస్ షర్మిల టార్గెట్ అంతకు మించి ఉంది. రాబోయే ఎన్నికలలో గెలుస్తామనే దురాశ ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. కానీ ఆలోగా ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆకర్షించగలిగితేనే ఆమెకు కాంగ్రెస్లో ‘ప్రత్యేకహోదా’ లభిస్తుంది.
బహుశః అందుకే ఆమె తన అన్న జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారని చెప్పవచ్చు. అప్పుడు ఆమె నాయకత్వంపై వైసీపితో సహా ఇతర పార్టీల నేతలకు నమ్మకం ఏర్పడుతుంది. కనుక ప్రత్యేకహోదా పేరుతో ఆమె పోరాటాలు, వాటి వెనుక ఆరాటం అంతా పార్టీలో తనకు ‘ప్రత్యేకహోదా’ని ఏర్పరచుకుని, ఏపీ కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ప్రసాదించడానికే!




