ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమి తరువాత కూడా వైసీపీ నేతల ప్రవర్తనలో, వారు ప్రత్యర్థుల పై చేసే రాజకీయ విమర్శలలో ఎటువంటి తేడా కనిపించడం లేదు. రాజకీయం ముసుగులో వ్యక్తిగత విమర్శలు చేయడం, వ్యక్తత్వహనానికి పాల్పడడం వైసీపీ నాయకుల రాజకీయంలో ఒక భాగంగా మారిపోతుంది.
వైసీపీ నేతలు చేస్తున్న ఈ రోత రాజకీయానికి కనీసం మహిళలకు కూడా మినహాయింపు లభించడం లేదు. తాజాగా వైసీపీ నేత, మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్ హోమ్ మంత్రి అనిత పై చేసిన మేకప్ కామెంట్స్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక మహిళా నేతను ఉద్దేశించి ఇలా మాట్లాడడం వైసీపీ పార్టీ సంస్కారానికి నిదర్శనంగా భావించాలా.? గుడివాడ అమర్నాథ్ ఒక కార్యక్రమంలో పాల్గొని తన చుట్టూ ఉన్న వైసీపీ క్యాడర్ ని సంతోష పెట్టడానికి, వారిని ఉత్సాహపరచడానికి చేసిన రాజకీయ విమర్శలు హద్దులు దాటాయి.
మనకి ఒక మేకప్ మంత్రి ఉంది, ఆమె ఈ ఎండలో తిరిగితే కేజీ బయటపడుతుంది, నేను వాడి వదిలేసిన బుల్లెట్ కారు వాడుకుంటూ నా మీదే విమర్శలు చేస్తావా.? నీకు ఏమైనా సిగ్గు, శరం ఉందా.? నువ్వు చేసే ఉద్యోగాలు మా ఊరి అమ్మాయిలు చేయలేరు అంటూ ఇలా హీనాతిహీనంగా గుడివాడ, మంత్రి అనిత ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అయితే రాజకీయ విమర్శల పేరుతో మహిళల పై, మహిళా నేతల పై వైసీపీ నేతలు చేస్తున్న ఈ కామెంట్స్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగా ఉండాలి కానీ మహిళల కట్టుబొట్టు, వారి వస్త్రధారణ, వారి అలంకరణ పట్ల ఉండకూడదని, అలావుంటే అది మహిళలను అవమానించినట్టే అన్నారు.
ఇక అటువంటి విమర్శలు చేసే స్థాయికి వైసీపీ నాయకులు పతనమయ్యారంటూ గుడివాడ కామెంట్స్ పై పవన్ మండిపడ్డారు. అమర్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్క అనితను మాత్రమే అన్నట్టుగా కాదని, రాష్ట్రంలోని సగటు మహిళలందరిని అవమానించినట్టే అన్నారు.
అయితే వైసీపీ నేతలు తమ మాటలతూటాలతో ప్రత్యర్థి పార్టీ మహిళా నేతలను కించపరచడం కొత్తేమి కాదు. అలాగే అసలు రాజకీయాలకు సంబంధం లేని మహిళలను కూడా రాజకీయ వేదికలెక్కించి వారి ఆత్మగౌరవాన్ని కూడా కించపరిచిన ఘనత వైసీపీ సొంత.
నాడు నారా భువనేశ్వరి ఉదంతం నుంచి మొన్నీమధ్య కోవూరు వైసీపీ ఇంచార్జ్ ప్రసన్న కుమార్ కోవూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన కామెంట్స్ వరకు, అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమె సొంత సోదరి వైఎస్ షర్మిల పసుపు చీర కామెంట్స్ నుంచి నేడు గుడివాడ అమర్నాథ్ అనిత పై చేసిన మేకప్ కామెంట్స్ వరకు అన్ని కూడా మహిళల టార్గెట్ గానే ముందుకెళ్లాయి.
అయితే నాడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది వైసీపీ అధికారం అనుభవిస్తుంది, కానీ నేడు వైసీపీ కనీసం ప్రతిపక్షానికి కూడా అర్హత పొందలేదు. అయినా కూడా వైసీపీ ఇప్పటికి తన తీరు మార్చుకోకుండా ఇలా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరి మీద నోరు పారేసుకుంటూనే వస్తుంది. మరి నాడు వైసీపీ అహంకారం అయితే ఇప్పుడు టీడీపీ.?




