వైస్ షర్మిల ఇప్పుడు ఈ పేరు వింటే చీకటి చూసి చిన్నపిల్లలు భయపడిన తీరుగా వైకాపా నేతలు భయపడిపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్ మీద విమర్శల పదును పెంచుతుంది వైస్ షర్మిల. మొన్న షర్మిల ఎన్నికల అఫడవిట్ లో తన అన్న, వదిన ల దగ్గర తానూ సుమారు 82 కోట్లు అప్పు తీసుకున్నట్లుగా ప్రకటించిన షర్మిల అందుకు వివరణ కూడా గట్టిగానే ఇచ్చింది.
తనకు తన తండ్రి వారసత్వంలో భాగంగా రావాల్సిన మొత్తంలో పిసరంత భాగం ఇచ్చి అది అప్పుగా ఇచ్చి జగన్ తనకు అన్యాయం చేశారనే విధంగా జగన్ వ్యవహారశైలిని తప్పుబట్టింది. సొంత చెల్లికి తనకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా అక్కా ఆలోచించండి అంటూ మొదలుపెట్టిన షర్మిల అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్ కు గ్యాప్ లేకుండా తన విమర్శలతో వాయించుతూనే ఉంది.
ఒకరకంగా ఈ విమర్శల మోత ప్రజలలో చర్చకు రాకుండా ఉంచేందుకే జగన్ అండ్ కో పవన్ వ్యక్తిగత జీవితాన్ని మరో సారి చర్చలకు తీసుకువచ్చింది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. నిన్న కాంగ్రెస్ సభలో మాట్లాడిన షర్మిల తన అన్న పై మరో కొత్త విమర్శతో ముందుకొచ్చింది. తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేసిన నాయకులను తీసుకువచ్చి జగన్ వారికీ పార్టీలో పెద్ద పీట వేసి పదవులు కట్టబెట్టారంటూ బొత్స, రోజా, విడుదల రజని, పెద్ది రెడ్డి పేర్లు బయటపెట్టింది.
వీరంతా గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డిని, ఆయన సతీమణి విజలక్ష్మిని కూడా అన్యాయంగా దూషించారు. ఇటువంటి వారంతా ఇప్పుడు జగన్ కు సొంత మనుషులయ్యారు, ఆయన కోసం ఆయన పార్టీ కోసం కుటుంబాన్ని వదిలి 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వారు, ఆయన కోసం పని చేసి గొడ్డలి వేటుకు బలయిపోయినవారు పరాయివాళ్ళయ్యారు. ఈ రోజు తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి నేతలు పక్కన పెట్టుకుని మా పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ జగన్ శైలిని తప్పుబట్టారు.
అలాగే తన అన్న జగన్ కుంభకర్ణుడు కన్నా దారుణమైన వాడు అని కనీసం కుంభకర్ణుడైన ఆరు నెలలకోసారి లేచి పనిచేస్తాడు కానీ ఈ జగన్ ఐదేళ్లు ప్యాలస్ గేటు దాటకుండా ఇప్పుడు ఎన్నికల కోసం మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి ఓట్ల రాజకీయాలు మొదలుపెట్టారు అంటూ అటు జగన్ పై విరుచుకుపడుతున్నారు. అలాగే ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన హామీలన్నీ మద్యం షాపులో అమలవుతున్నాయంటూ విమర్శిస్తున్న షర్మిలకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు వైకాపా నేతలు.






