వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సిఎం కేసీఆర్కు, తన అన్న, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా చురకలువేయడం విశేషం.
హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ, “పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వలననే భద్రాచలం ముంపుకు గురవుతోందని ఇప్పుడు వాదిస్తున్నారు. ఆనాడు సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్కు ఆహ్వానించి కౌగలించుకొని కబుర్లు చెప్పినప్పుడు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు రాలేదా?సాగునీటి రంగంలో మీ అంత మేధావిలేరన్నట్లు మాట్లాడుతుంటారు కదా?పోలవరం ప్రాజెక్టు కడితే తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి సమస్యలు ఎదురవుతాయని మీకు తెలియదా? తెలిస్తే ఎందుకు ఊరుకొన్నారు?
ఇద్దరు ముఖ్యమంత్రుల మద్య కౌగలించుకొని కబుర్లు చెప్పుకోనేంత మంచి సఖ్యత ఉన్నప్పుడు, కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా?కానీ ఆ పని చేయకుండా వరదలు వచ్చిన వారం రోజుల తరువాత తాపీగా హెలికాఫ్టర్లో తిరిగి కట్ట మీద నిలబడి క్లౌడ్ బరస్ట్, విదేశీకుట్ర అంటూ పిట్టకధలు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మీ వైఫల్యాలను కప్పి పుచ్చుకొని, ప్రజల దృష్టి మళ్లించేందుకు పోలవరం ప్రాజెక్టు వలన భద్రాచలం మునిగిపోతోందంటూ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు. ముంపు ప్రాంతాలలో ప్రజలను ఆదుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు ఈ డ్రామాలతో ప్రజలను మభ్యపెడతారు?” అంటూ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.
తెలంగాణ సిఎం కేసీఆర్ మాత్రమే కాదు… ఇక్కడ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు అదేవిదంగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. సిఎం కేసీఆర్ జూన్, 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆహ్వానిస్తే వెళ్ళి బటన్ నొక్కి వచ్చారు. ఏమంటే “పూర్తయిన ప్రాజెక్టును ఎలాగూ ఆపలేము కనుక వెళ్ళి బటన్ నొక్కి వచ్చాను,” అని సమర్ధించుకొన్నారు. కానీ ఆ తరువాత తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కృష్ణా, గోదావరి బోర్డులలో పిర్యాదులు చేయించారు. సిఎం కేసీఆర్ కూడా పిర్యాదులు చేయించారు.
కనుక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం లోపాయికారీగా సహకరించుకొంటూనే ఇటువంటి డ్రామాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని స్పష్టమవుతోంది. సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా అదే చెపుతున్నారు.



