ఏ రంగంలో ఉన్నవారైనా వారు చేసే పని పట్ల పూర్తి అవగాహన, నిబద్దత ఉండాలి. అప్పుడే రాణిస్తారు. రాజకీయాలలో ఉన్నవారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది.
ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన లక్ష్యం పట్ల ఆయనకు పూర్తి స్పష్టత ఉంది. కనుక దానిని సాధించేందుకు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దానిని కొందరు టిడిపి, బీజేపీ నేతలతో సహా జగన్ కూడా తప్పు పట్టారు.
ఇదేవిదంగా పవన్ కళ్యాణ్కి కూడా టిడిపితో పొత్తు పట్ల పూర్తి స్పష్టత ఉంది కానీ పొత్తులు-వాటి ఫలితాల విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకి పూర్తి స్పష్టత ఉంది కనుక ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వారు వెనక్కు తగ్గలేదు. కనుకనే లక్ష్యం సాదించగలిగారు. ఇప్పుడు వారి నిర్ణయం సరైనదని అందరూ ఒప్పుకుంటున్నారు కూడా.
అయితే వారి పొత్తులను, బీజేపీతో టిడిపి పొత్తులను తప్పు పట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి స్పష్టత లేకపోవడం వలననే మోడీ, అమిత్ షాలతో లోపాయికారిగా స్నేహం చేస్తూ 5 ఏళ్ళు పబ్బం గడుపుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడులాగా ధైర్యంగా బహిరంగంగా బీజేపీతో పొత్తుకి సిద్దపడలేదని చెప్పవచ్చు.
చంద్రబాబు నాయుడు తాను మోడీ పక్షాన్న ఉన్నానని చాలా స్పష్టంగా చెప్పారు కనుక కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆయనను తప్పు పట్టడం లేదు.
కానీ నేటికీ మోడీ, అమిత్ షాలతో రహస్యంగా అంటకాగుతున్న జగన్, ఢిల్లీలో ధర్నాకి కాంగ్రెస్ మిత్ర పక్షాలను ఆహ్వానించడంతో తాను వారి కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉన్నాననే తప్పుడు సంకేతాలు పంపిన్నట్లయింది. కనుక కాంగ్రెస్ మిత్రపక్షాలు వచ్చి జగన్కు సంఘీభావం తెలిపాయి.
జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక కాంగ్రెస్ నేతలు కూడా వస్తారనుకున్నారు. కానీ రాలేదు. ఎందుకు రాలేదని జగన్ ప్రశ్నించడం మరో తప్పు. దానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నుంచి ఘాటుగా సమాధానం వచ్చింది!
“మీ పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడితే దానికి కాంగ్రెస్ ఎందుకు రావాలి? ఓ పక్క బీజేపీ అక్రమ సంబందం పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన మీకు మేమేందుకు సంఘీభావం ప్రకటించాలి? కాంగ్రెస్ పార్టీ మణిపూర్ ఘటనలపై బీజేపీతో పోరాడుతున్నప్పుడు మీరెందుకు మాకు మద్దతు ఇవ్వలేదు. సిద్దం అన్నవాళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలు సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడుదామని పిలుస్తున్నారు?” అంటూ ఘాటుగా బదులిచ్చారు.
వైఎస్ షర్మిలకున్నపాటి రాజకీయ స్పష్టత పదేళ్ళుగా రాజకీయాలలో, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం విడ్డూరమే కదా? ఇంతకీ ఆయన మోడీ, అమిత్ షాలతోనే ఉంటారా లేక తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారా?






