తెలంగాణ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న వైఎస్ షర్మిల ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికలో పోటీ చేస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయాన్ని ఆమె నిర్ధారించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కు పులివెందుల ఎలాగో, తనకు పాలేరు అలా అని ఆమె పేర్కొన్నారు. షర్మిల బుధవారం ఖమ్మం జిల్లా నేతలతో లోటస్పాండ్లో సమావేశమయ్యి ఈ ప్రకటన చేసారు… షర్మిల పార్టీ ప్రకటనకు సంబంధించిన బహిరంగ సభ కూడా ఖమ్మం లోనే ఏర్పాటు చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సభకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ నిర్వహించాలని ప్రస్తుతానికి ఉన్న ఆలోచన. అయితే ప్రభుత్వం కరోనా దృష్ట్యా ఏవైనా ఆంక్షలు విధిస్తే? ఎలా అన్న కోణంలో నేతలు ఆలోచిస్తున్నారు.
సభ నిర్వహణ నేపథ్యంలో మైదానానికి అవసరమైన అనుమతి వచ్చినప్పటికీ, పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇంకా అనుమతి రాలేదు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభకు జనసమీకరణ ఉండాలని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, తాము మాత్రం సభ నిర్వహించి తీరుతామని షర్మిల నేతలతో అనడం విశేషం.





