ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో అందరి దృష్టిని ఆకర్షించిన వాటిలో కడప పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ షర్మిల, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇద్దరూ ముఖాముఖీ తలపడటమే ఇందుకు కారణం.
ఆయన ‘చిన్న పిల్లోడు’ కనుక అండగా, పెద్ద దిక్కుగా నిలబడిన జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదుర్కొంటున్నారు. కనుక ఈ పోటీ ఆమెకు జగన్మోహన్ రెడ్డికి మద్య జరుగుతున్నట్లే భావించవచ్చు.
ఇక జగన్ ఎప్పటిలాగే పులివెందుల నుంచి శాసనసభకు పోటీ చేశారు. అది కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉంది.
కనుక జగన్ ప్రభావం కడప పార్లమెంట్ సీటు మీద, అలాగే వైఎస్ షర్మిల ప్రభావం పులివెందుల శాసనసభ సీటు మీద తప్పక ఉంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి, షర్మిల, అవినాష్ రెడ్డిలలో ఎవరిని కడప ప్రజలు ఎన్నుకుంటారు? అనే ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
కడపలో షర్మిలని, పులిచింతలలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే అవకాశం ఉందని చెప్పారు. అంటే వైసీపిలో క్రాస్ ఓటింగ్ జరుగబోతోందని చెప్పారు. కూతురుని గెలిపించాలని విజయమ్మ చివరి నిమిషంలో చేసిన అభ్యర్ధన వృధాపోదని ఆమె మాటను గౌరవించి వైఎస్ షర్మిలని తప్పక గెలిపిస్తారని చెప్పారు.
కానీ కడప ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కూడా కాదనలేరు కనుక పులిచింతలలో ఆయనను గెలిపించుకుంటారని తులసి రెడ్డి చెప్పారు. అంటే రాష్ట్రంలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎంపీ సీటుతో బోణీ కొట్టబోతోందన్న మాట! కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధులను బరిలో దించినప్పటికీ ఇంతకు మించి ఎక్కువ ఆశించడం లేదు కూడా.
కానీ కడపలో వైఎస్ షర్మిల చేతిలో అవినాష్ రెడ్డి ఓడిపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన్నట్లే. పైగా ఆ ‘చిన్న పిల్లోడు’ సీబీఐ ప్రమాదంలో చిక్కుకుంటే కొత్త సమస్యలు మొదలైపోతాయి. వాటి పర్యవసానాలు భయంకరంగా ఉండవచ్చు.
కనుక ‘చిన్న పిల్లోడు’ కూడా విదేశాలకు వెళ్ళిపోతారని వైఎస్ షర్మిల ముందే చెప్పారు. వెళ్తారో లేదో తెలీదు కానీ కడప ఓటర్లు కూడా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. కనుక జూన్ 4వరకు అందరూ క్షణమొక యుగంలా ఎదురుచూడక తప్పదు.






