షర్మిలా మజాకా… కానిస్టేబుల్స్‌కి లెంపకాయలు!

YS-Sharmila-Slaps-Telangana-Constableఆమె ఎంతైనా వైఎస్ బిడ్డ… వైఎస్ షర్మిల! కనుక ఆమెకు కోపం వస్తే ఎస్సై, కానిస్టేబుల్ అనే తేడా చూడకుండా ఎవరినైనా చెంపదెబ్బ కొట్టగలరు. ఈ విషయం తెలీక హైదరాబాద్‌ పోలీసులు ఆమెను అడ్డుకోబోయి ఈరోజు చెంపదెబ్బలు తిన్నారు.

ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఆమె హైదరాబాద్‌లోని తమ లోటస్ పాండ్ నివాసం నుంచి టిఎస్‌పీఎస్సీ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందాన్ని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. అయితే పోలీసులు ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె వారందరినీ తోసుకొంటూ వెళ్ళి తన కార్లో కూర్చోగా ఓ ఎస్సై, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్‌ కారుకి అడ్డంగా నిలబడి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారు అడ్డుగా నిలబడి ఉండగానే వైఎస్ షర్మిల వారిపైకి తన కారును పోనిచ్చారు. చివరికి వారు కారును కదలనీయకుండా నిలబడిపోవడంతో ఆమె కారు దిగి “నన్ను ఎందుకు అడ్డుకొంటున్నారంటూ…” వారితో వాదనకు దిగారు.

ADVERTISEMENT

ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్‌ ఆమెను పట్టుకోబోతే వైఎస్ షర్మిల వారి చేతులను విసిరికొట్టి, వారిలో ఓ కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టారు. దాంతో ఆ మహిళా కానిస్టేబుల్ షాక్ అయ్యింది. కానీ వెంటనే తేరుకొని ఆమెను చేతులు పట్టుకొని ఆపబోతే మళ్ళీ విసిరికొట్టారు. ఈలోగా అక్కడే ఉన్న ఎస్సై ఆమె కారులో డ్రైవరును బయటకు రప్పించబోతే, వైఎస్ షర్మిల ఆయన వద్దకు వెళ్ళి ఎస్సై గూబ గుయ్యిమనిపించేశారు. “నా గురించి ఏమనుకొంటున్నారు? ఎవరనుకొంటున్నారు నన్ను?ఓ ప్రతిపక్ష పార్టీ మహిళా నేతతో ఇలాగేనా ప్రవర్తించేది?” అంటూ ఆయనతో చాలా దురుసుగా ప్రవర్తించారు.

ఈలోగా మరికొంత మంది మహిళా కానిస్టేబుల్స్‌ అక్కడకు వచ్చి ఆమెను కదలనీయకుండా పట్టుకోవడం వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు ఆమెపై సెక్షన్స్ 330, 353 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

వైఎస్ షర్మిల సిట్‌ బృందం దర్యాప్తును వ్యతిరేకిస్తున్నప్పుడు మళ్ళీ వారికి వినతిపత్రం ఇవ్వాలనుకోవడం దేనికో అర్దం కాదు. ఆమె వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరుతుంటే పోలీసులు ఆమెను అడ్డుకోవలసిన అవసరమే లేదు. రాంగోపాల్ వర్మ సినిమాలు తీయలేక వివాదాలు, వివాద్పస్పద వ్యాఖ్యలతో జనం దృష్టిని ఆకర్షిస్తున్నట్లే, తెలంగాణ రాజకీయాలలో తన ఉనికిని చాటుకోవడం తిప్పలు పడుతున్న వైఎస్ షర్మిల దాని కోసమే తరచూ ఈవిదంగా హడావుడి చేస్తున్నారేమో? అనే సందేహం కలుగుతుంది.

ఈ విషయం తెలుసుకొన్న ఆమె తల్లి వైఎస్ విజయమ్మ హడావుడిగా జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ చేరుకోగా పోలీసులు ఆమెను అడ్డుకొన్నారు. వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశామని కనుక విజయమ్మను ఇంటికి తిరిగి వెళ్ళిపోవలసిందిగా ఎస్సై, సీఐ ఆమెకు వినయంగానే చెప్పారు. మహిళా కానిస్టేబుల్స్ ఆమెను కారులో ఎక్కి వెళ్ళిపోవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంటే, దగ్గరకు వస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త… అంటూ విజయమ్మ వారిని హెచ్చరించారు. కానీవారు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించబోతే ఆమె కూడా ఓ మహిళా కానిస్టేబుల్‌ని చెంపదెబ్బకొట్టారు. తర్వాత వారిని ఈసడించుకొంటూ కారులో ఇంటికి వెళ్ళిపోయారు. వారు చెపుతున్న రాజన్న రాజ్యం అనే ఇదేనేమో?ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తల్లీ కూతుర్లు తెలంగాణ పోలీసులను బహిరంగంగా చెంపలు పగులగొట్టగలిగినప్పుడు, అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవలసిందే.

ADVERTISEMENT
Latest Stories