రాబోయే ఎన్నికలలో జగన్ – షర్మిలలు ప్రత్యర్థులుగా తలపడుతున్న వైనం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జగన్ ను ఏతావాతా ఏకిపారేస్తున్న షర్మిల, కడప ఎంపీగా విజయం సాధించడమే కాకుండా, జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీరిద్దరి నడుమ ఉన్న తల్లి విజయమ్మ చూపులు ఎవరివైపు అన్న అంశం కూడా రాజకీయాల్లో ఆసక్తిగా మారిన వేళ, తాజాగా ఓ హాట్ న్యూస్ బయటకు వచ్చింది. వర్తమాన రాజకీయాలకు దూరంగా అమెరికా వెళ్లి, ఎలక్షన్స్ హడావిడి పూర్తిగా ముగిసిపోయిన తర్వాత ఏపీ చేరుకునే విధంగా ప్రణాళికలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ అంశాన్ని జగన్ – షర్మిలలు ఎవరు తమకు అనుకూలంగా మలుచుకుంటారో వేచిచూడాలి. కుటుంబ రాజకీయాలను రక్తి కట్టించడంలో సిద్ధహస్తుడిగా జగన్ ఇప్పటికే అనుభవాన్ని గడించారు. అలాగే తన ప్రసంగాలలో నిత్యం తల్లి విజయమ్మ పేరును ప్రస్తావిస్తూ షర్మిల కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ముఖ్యంగా వైఎస్ వివేకా మరణాన్ని ప్రస్తావిస్తూ, ‘కావాలంటే విజయమ్మను కూడా అడగండి’ అంటూ జగన్ ను ఇరుకునే పెట్టే విధంగా సాగుతున్న షర్మిల ప్రసంగాలను నిలువరించేందుకే విజయమ్మను విదేశాలకు జగన్ పంపిస్తున్నారన్న భావన కూడా పొలిటికల్ వర్గాలలో వినపడుతోంది.
వచ్చే ఎన్నికలలో సాధించే విజయం ప్రజల చేతుల్లో ఉండగా… తల్లి విజయమ్మ విషయంలో ఎదురుగాలి వీయకుండా జగన్ విజయాన్ని సాధించారని అనుకోవాలా?




