రాష్ట్రంలో కాదుకాదు దేశంలోనే వైసీపీ కి వ్యతిరేకంగా ఎక్కడ చీమ చిటుక్కు మన్నా దానికి కారణం చంద్రబాబు నాయుడే అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని ఏమార్చడానికి నిత్యం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నారు వైకాపా నేతలు.
ప్రభుత్వ ఉద్యోగులు తమకు జగన్ ఇచ్చిన హామీ అమలు చేయలేదు అంటూ నిరసన తెలిపినా, నిరుద్యోగులు తమకు ఉపాధి లేదు అంటూ రోడ్ ఎక్కినా, అమరావతి రైతులు తమకు న్యాయం చేయమంటూ నినదించిన దాని వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నాడు అంటూ నెపం మొత్తం బాబు మీద నెట్టి సమస్యను పక్కదారి మల్లించడం అలవాటుగా మారిపోయింది వైసీపీ ప్రభుత్వానికి.
అలాగే వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది దానిని గద్దె దింపడమే నా ప్రధమ కర్తవ్యం అంటూ వైసీపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ విమర్శల వెనుక బాబే, తన తండ్రి చావుకి న్యాయం కావాలి అంటూ న్యాయపోరాటం చేస్తున్న వివేకా కూతురు సునీతా వెనుక బాబే, అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల వెనుక బాబే..,
అలాగే రాష్ట్రంలో మద్యం మాఫియా, సాండ్ మాఫియా నడుస్తుంది అంటూ ఆరోపిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వెనుక బాబే…ఇలా వైసీపీ కి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా దాని వెనుక ఉన్నది బాబే అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెపుతూ కాలం వెళ్లబుచ్చుతున్న వైసీపీ కి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూపంలో మరో అపశకునం తగిలింది.
గత ఎన్నికలలో జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ ప్రశాంత్ కిషోర్ ఈసారి రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ గాలికి వ్యతిరేక పవనాలు తప్పవని కుండ బడ్దలు కొట్టడంతో….దీని వెనుక కూడా బాబు అస్తమే ఉందంటూ వైసీపీ మరో వాదనను తెరమీదకు తెచ్చింది. మొన్నిఈమధ్య పిన్షన్ల పంపిణీలో వాలంటీర్ల సేవలను ఆపాలి అంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను సైతం బాబు ఖాతాలో వేసి చెయ్యి దులుపుకోవాలి ప్రయత్నించారు వైసీపీ పెద్దలు.
పక్క రాష్ట్రమైన తెలంగాణలో అధికార మార్పిడి జరిగి వైసీపీ రహస్య స్నేహితుడైన కేసీఆర్ ఓటమికి, రేవంత్ రెడ్డి గెలుపుకి చంద్రబాబే కారణం అన్నారు. ఇలా దేశంలో ఎక్కడ ఎం జరిగిన దానికి బాబే కారణం అంటే బాబు బలాన్ని వైసీపీ పెంచాలనుకుంటుందా…? లేక వైసీపీ అసమర్ధతను ఒప్పుకుంటున్నారా..? అనే అనుమానాలు తలెత్తక మానవు అనేది వైసీపీ గ్రహించలేకపోవడం కాస్త విడ్డురంగా ఉంది.
ఇంతమందిని ప్రభావితం చేసే శక్తి, ఇంతమందికి ప్యాకేజ్ ఇచ్చే సమర్ధతే నిజంగా చంద్రబాబు సొంతం అయితే గత ఎన్నికలలో టీడీపీ అధికారానికి దూరమయ్యేదా…? మంగళగిరిలో నారా లోకేష్ ఓటమి పాలయ్యేవారా..? అమరావతిలో వైసీపీ జెండా ఎగిరేదేనా..? కోడికత్తి, వివేకా హత్య కేసులలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలు మరో అవకాశం కోసం నామినేషన్లు వేసే స్థాయికి వచ్చేవారేనా..?
ఇలా వైసీపీ చేస్తున్న ఆరోపణలకు – రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో వైసీపీ విమర్శలలో విశ్వసనీయత కరువయ్యింది అనే వాదన ప్రజలలో బలంగా వినపడుతుంది. దీని బట్టి వైసీపీ ‘సర్వ రోగాలకు’ చంద్రబాబునే బూచిగా చూపెట్టి జగన్ మరో ఛాన్స్ కోసం సిద్దమయ్యారనేది సుస్పష్టంగా కనపడుతుంది.




