రాజకీయాల కోసం సొంత రాష్ట్రాలను దెబ్బ తీసుకుంటే….

YSRCP and BRS propaganda affecting Andhra and Telangana politics

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీలు రెండూ ఒకే విధంగా రాజకీయాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

రెండు పార్టీల మద్య ఒకే ఒక్క తేడా ఏంటంటే, ఇక్కడ వైసీపీ ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించేలా, రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుంటుంది.

ADVERTISEMENT

అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వలన తెలంగాణకు నష్టం కలుగుతోందని, రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలుగుతోందని వాదిస్తుంటుంది. కానీ రెండు పార్టీలు చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారం వలన అవి చేస్తున్న రాజకీయాల వలన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీరని నష్టం కలుగుతోంది.

రెండు ప్రభుత్వాలకు వాటి దుష్ప్రచారం ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూ ముందుకు సాగడమే పెద్ద పని అయిపొయింది.

ఇక్కడ రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోతోందని, స్త్రీశక్తి పేరుతో ప్రభుత్వం మహిళలని మోసం చేస్తోందని వైసీపీ దుష్ప్రచారం చేస్తూనే ఉంది.

తాజాగా జెఎస్ డబ్ల్యూ స్టీల్స్ కంపెనీ ఏపీ నుంచి ఒడిశాకు తరలిపోయిందంటూ వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది.

కానీ వాస్తవం ఏమిటంటే, ఆ కంపెనీ, ఏపీ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ (ఏపీఎండిసీ), దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీతో కలిసి ఒడిశాలో రూ.1,075 కోట్లు పెట్టుబడితో ఇనుప ఖనిజం తవ్వి తీసే ప్రాజెక్టు చేపట్టబోతున్నాయి.

దీనిలో ఏపీఎండిసీకి 11 శాతం, జెఎస్ డబ్ల్యూ స్టీల్స్ కంపెనీ 89శాతం వాటాలున్నాయి. దీని గురించే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.

దీనిని ఏపీ ప్రభుత్వం (ఫ్యాక్ట్ చెక్.ఏపీ. గవర్నమెంట్.ఇన్) ఖండిస్తూ సోషల్ మీడియాలో వాస్తవాలు వివరించింది.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ తేలేకపోగా ఉన్నవాటిని కూడా తరిమేశారు. నేడు అధికారంలో లేనప్పటికీ ఈవిధంగా దుష్ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. పరామర్శయాత్రల పేరుతో స్వయంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ, దానికీ సిఎం చంద్రబాబు నాయుడునే నిందిస్తున్నారు.

ఇక్కడ జగన్‌ & కో ఈవిదంగా దుష్ప్రచారం చేస్తుంటే, తెలంగాణలో కేటీఆర్‌, హరీష్ రావులు మరో రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు.

కేంద్రం ఏపీకి సెమీ కండక్టర్ పరిశ్రమని కేటాయించడంతో తెలంగాణకు దక్కాల్సిన ఆ పరిశ్రమని చంద్రబాబు నాయుడు ఏపీకి తీసుకుపోయి తెలంగాణకు తీరని నష్టం కలిగించారని దుష్ప్రచారం చేస్తున్నారు. అలవాటు ప్రకారం దీనికీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని ముడిపెట్టి ఇద్దరూ కుమ్మక్కయ్యి తెలంగాణని దెబ్బ తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోపక్క హరీష్ రావు బనకచర్ల ప్రాజెక్టుపై చేసిన రాజకీయాలతో ఏం జరిగిందో అందరూ చూశారు.

ఈవిదంగా వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు చేస్తున్న నీచ రాజకీయాలు, దుష్ప్రచారంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వాటిని ఎదుర్కోవడమే పెద్ద పనిగా మారిపోయింది. ఓ కొత్త పధకం లేదా అభివృద్ధి పని చేపట్టాలన్నా ఆ రెండు పార్టీలు ఏవిదంగా దుష్ప్రచారం చేస్తాయో, ఎలా దెబ్బ తీస్తాయో అని ప్రభుత్వాలు ముందుగానే ఆలోచించుకోవలసి వస్తోంది.

వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీలు రెండూ గతంలో అధికారంలో ఉన్నవే. అవి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటునప్పుడు, దిగిపోయాక తమ తమ రాష్ట్రాలని ఈవిదంగా దెబ్బ తీయాలనుకోవడం దౌర్భాగ్యమే కదా?

ADVERTISEMENT
Latest Stories