కేసులు, అరెస్టులతో సీనియర్లకు మెడల్స్… జూనియర్లకు గుదిబండలు

YSRCP Arrests: Seniors Rise, Juniors Pay the Price

ప్రభుత్వం ఏమి చేసినా దానిని వ్యతిరేకించడం, దుష్ప్రచారం చేస్తుండటం, మంచి చేస్తే అది గతంలో తాము చేసిన కృషి వల్లనే జరిగిందని చెప్పుకోవడం వైసీపీకి పరిపాటిగా మారింది. ఈ విధానం వలన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.

కానీ పార్టీ వైఖరికి అనుగుణంగా ప్రభుత్వంపై అదేపనిగా దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేస్తున్న పార్టీలో దిగువ స్థాయి నేతలు మాత్రం కేసులలో చిక్కుకొంటున్నారు. జైళ్ళకు కూడా వెళ్ళాల్సి వస్తోంది.

ADVERTISEMENT

వైసీపీలో మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులు నమోదైనా, జైలుకి వెళ్ళినా వాటి నుండి బయటపడగల అంగబలం, అర్ధ బలం వారికి పుష్కలంగా ఉంది. కనుక సులువుగానే బయటపడుతుంటారు.

పైగా ఈ కేసులు, అరెస్టులు, జైళ్ళ వలన వారికి రాజకీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుంది. అందువల్ల వారు మరింత పాపులర్ లీడర్లుగా మారుతారు. రాజకీయాలలో అలాంటి వారికి చాలా డిమాండ్ ఉంటుంది. కనుక ఆ స్థాయి నాయకులు ఎవరూ ఇప్పుడు కేసులు, అరెస్టులు, జైలుకి భయపడటం లేదు. కుదిరితే ఓసారి జైలుకి వెళ్ళివస్తేనే మంచిదనే భావన నెలకొంది.

కానీ ద్వితీయ. తృతీయ స్థాయి రాజకీయ నాయకులకు ఇవి వర్తించవు. వారు కేసులలో చిక్కుకుంటే ముందుగా వారి జీవనోపాధి అంటే ఉద్యోగాలు, ఉపాధి దెబ్బ తింటాయి. అంతేకాదు ఈ కేసులు, అరెస్టుల రికార్డు వారిని భవిష్యత్తులో కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇవే వారి ఉద్యోగాలు, ఉపాధికి అవరోధంగా మారుతాయి.

ఈ సమస్యలు పెరిగితే వారి కుటుంబం ఆర్ధిక సమస్యలలో కూరుకుపోతుంది. కుటుంబం విచ్చినమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. బహుశః చాలా మంది ఇప్పటికే ఇవన్నీ అనుభవపూర్వకంగానే తెలుసుకొని ఉంటారు.

ఇందుకు తాజా ఉదాహరణగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో సహా మరో 27 మంది కర్నూలు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదవడం గురించి చెప్పుకోవచ్చు.

కర్నూలు బస్సు ప్రమాదం గురించి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేసినందునే కేసులలో చిక్కుకున్నారు.

నిన్న ఆమెతో సహా అందరూ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యి పార్టీ ఆదేశం మేరకు, అదిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే తాము ఆవిధంగా మాట్లాడామని సంజాయిషీ ఇచ్చారు. కానీ జగన్‌ లేదా వైసీపీ పెద్దలు తామే వారిని ఆ విదంగా మాట్లాడమని ప్రోత్సహించామని ఒప్పుకుంటారా?అంటే కాదనే చెప్పొచ్చు. ఒప్పుకోరు కనుక ఈ కేసులు వీరి మెడకే చుట్టుకుంటాయి.

వారు ఈ కేసులలో నుంచి బయటపడేందుకు వైసీపీ అధిష్టానం ఉచితంగా ఆర్ధిక, న్యాయ సహాయం అందిస్తుందో లేదో తెలీదు. ఒకవేళ అందించినా ముందే చెప్పుకున్నట్లు ఈ కేసులు, వీటి పర్యవసానాలు వారు, వారి కుటుంబాలే అనుభవించాల్సి వస్తుంది.

సమాజంలో ప్రతీ ఒక్కరూ రాజకీయ చైతన్యం కలిగి ఉండటం అవసరమే. కానీ వర్తమాన రాజకీయాలలో అవాంచనీయమైన పరిస్థితులు నెలకొని ఉన్నందున, ఏదో ఓ పార్టీలో చేరి ఇలా అతి చేయడమే రాజకీయాలనే భ్రమతో తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నవారు చేజేతులా తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories