ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్ ఆదివారం కలిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆయన నివాసంలో జగన్తో భేటీ అయ్యారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తొందరలోనే తమ కుమారుడు వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరనున్నామని, తన సతీమణి పురందేశ్వరి మాత్రం తన ఇష్టప్రకారమే బీజేపీలోనే కొనసాగుతారని చెప్పారు. అయితే వారు హితేష్ కోసం ఆయన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా పర్చూరు పర్చూరు సీటు ఆశిస్తున్నట్టు సమాచారం.
దీని పై ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దగ్గుబాటి రాకను నిరసిస్తూ పర్చూరులోని స్థానిక రోటరీ భవన్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని.. పార్టీలో పనిచేస్తున్నవారికి అన్యాయం చేయొద్దని నేతలు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఇచ్చే సంప్రదాయం మంచిదికాదని వారంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. బలవంతంగా తమపై రుద్దితే సహాయనిరాకరణ తప్పదని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు కుమారుడి రాజకీయ ప్రవేశానికి అడ్డంగా ఉంటే పురంధేశ్వరి బీజేపీని వీడి రాజకీయాల నుండి తప్పుకుంటారని వెంకటేశ్వర రావు నిన్న అన్నారు. బీజేపీకి పురందేశ్వరి బీజేపీకి గుడ్ బై చెప్పేస్తే ఏపీలో ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరారు. త్వరలోనే ఆయన బాటలో మరికొందరు నడుస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే పురందేశ్వరి నిజంగానే బీజేపీని వీడతారా..? లేకుంటే ఆమె కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎంపీగా పోటీచేస్తారా..? అనేది చూడాల్సి ఉంది.



